ఆడపిల్లల పెండ్లిళ్ల కోసం దొంగతనాలు  

ఆడపిల్లల పెండ్లిళ్ల కోసం దొంగతనాలు  
  •     ఇంకో నలుగురి కోసం చోరీలు 
  •     కామారెడ్డి పోలీసులకు చిక్కిన నిందితుడు  


కామారెడ్డి, వెలుగు : మహారాష్ర్టకు చెందిన ఓ వ్యక్తికి ఐదుగురు ఆడపిల్లలున్నారు. అయితే చేసే పనికి వచ్చే జీతం సరిపోక..ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యాడు. దీంతో బిడ్డల పెండ్లిళ్లు చేసేదెట్లా అని రంది పెట్టుకున్నాడు. దొంగతనాలే మార్గమని భావించాడు. అయితే పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. కామారెడ్డి ఎస్పీ బి. శ్రీనివాస్​రెడ్డి కథనం ప్రకారం..మహారాష్ర్టలోని నాందేడ్ ​జిల్లా ఖందర్ ​తాలుకాలోని కౌటకు చెందిన రాజు విశ్వనాథ్​ ఒగ్లే కామారెడ్డి జిల్లా బాన్స్​వాడ టౌన్​లోని చైతన్య కాలనీలోని ఓ అపార్ట్​మెంట్​లో కొంతకాలంగా వాచ్​మన్​గా పని చేస్తున్నాడు. ఇదే అపార్ట్​మెంట్​లో ఉండే బచ్చు భుజేందర్​ఈనెల 10న తన ఇంటికి తాళం వేసి నిజామాబాద్ ​వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన విశ్వనాథ్​ తాళం పగుల గొట్టి నగలు, డబ్బు దొంగతనం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిఘా పెట్టారు. గురువారం ఆ నగలను అమ్మేందుకు వెళ్లిన రాజు విశ్వనాథ్​ ఒగ్లెను అరెస్టు చేసి రూ. 20 లక్షల విలువైన 41 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే విచారణలో విశ్వనాథ్ ​ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తనకు ఐదుగురు బిడ్డలు ఉన్నారని, పెద్ద బిడ్డ పెండ్లి చేయగా ఇంకా నలుగురు బిడ్డల పెండ్లి చేయాల్సి ఉండటంతో ఇలా దొంగతనాల బాట పట్టానని చెప్పాడు. డీఎస్పీ జగన్నాథరెడ్డి, టౌన్​ సీఐ ఉరేందర్​రెడ్డి ఉన్నారు.