డిచ్పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ లోని గర్ల్స్ హాస్టల్లో బుధవారం ఉదయం స్టూడెంట్స్కి పెట్టిన టిఫిన్లో కప్ప రావడం కలకలం సృష్టించింది. దీంతో పీడీఎస్యూ లీడర్లు, స్టూడెంట్స్ వర్సిటీ అడ్మిన్ బిల్డింగ్ను ముట్టడించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ వర్సిటీ ప్రెసిడెంట్ రాజేశ్వర్ మాట్లాడుతూ యూనివర్సిటీ ఆఫీసర్ల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతోనే టిఫిన్లో కప్ప వచ్చిందన్నారు. ఇట్లాంటి తిండి తిని స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. 450 మంది స్టూడెంట్స్కి ఒకే గర్ల్స్ హాస్టల్ సరిపోవడం లేదని, మరో హాస్టల్ నిర్మించాలని ఇప్పటికే ఎన్నోసార్లు వీసీ, రిజిస్ట్రార్లకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో కోతులు, పాములు తిరగడంతో క్లాస్లకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. జరిగిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. పీడీఎస్యూ వర్సిటీ సెక్రెటరీ సంతోష్, స్టూడెంట్స్పాల్గొన్నారు.