బండి సంజయ్ పై రాళ్ల దాడి ప్రచారం అబద్ధం

బండి సంజయ్ పై రాళ్ల దాడి ప్రచారం అబద్ధం

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై రాళ్ల దాడి జరిగిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి అన్నారు. గత నాలుగు రోజుల క్రితం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ కుమార్ పై కిసాన్ నగర్ లో రాళ్ల దాడి జరిగిందని, పలువురు కానిస్టేబుళ్లకు మరియు వారి కార్యకర్తకు దెబ్బలు తగిలాయని, కరీంనగర్ లో అంతా టెన్షన్ నెలకొని ఉందని దూలం కళ్యాణ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. అయితే అవన్నీ నిరాధార వార్తలని కమీషనర్ వివరణ ఇచ్చారు

పార్లమెంటు సభ్యులు,  శాసన సభ్యులు మరియు ఇతర ప్రముఖులు ఎవరైనా ఏదైనా ప్రజా కార్యక్రమాలలో పాల్గొన్న సమయంలో గానీ, ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ తరపున పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని కమీషనర్ అన్నారు. అంతేకాకుండా వారికి పూర్తి భద్రత కల్పించేలా సెక్యూరిటీ సిబ్బందిని కూడా నియమించినట్టు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఏ ప్రజా ప్రతినిధి పై కూడా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో  ఎక్కడా రాళ్ల దాడులు గానీ, భౌతికమైన దాడులు కానీ జరగలేదని,  అటువంటి  దాడి  జరిగి వుంటే,  అదే రోజు గౌరవ పార్లమెంటు సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకుని వచ్చే వారని, అంతేకాకుండా వారి వ్యక్తిగత రక్షణ కోసం కేటాయించిన పోలీసు సిబ్బంది వెంటనే వేగంగా స్పందించి ఉండేవారని  కమీషనర్ కమలాసన్ రెడ్డి  తెలియజేశారు.

సోషల్ మీడియాలో కొంతమంది తెలిసీ తెలియని పరిజ్ఞానంతో  ఉద్దేశ్యపూర్వకంగా ఎంపీ సంజయ్ పై రాళ్ల దాడి జరిగిందంటూ ఒక సందేశాన్ని ఫేస్ బుక్ మరియు వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా  ఇలా పోస్టులు పెడుతున్న  వారు తమ వైఖరి  మార్చుకోకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవలసి వస్తుందని తెలిపారు.

ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి చిన్న సంఘటనకు కూడా అవకాశం ఇవ్వకుండా, ప్రశాంతమైన వాతావరణంలో, ప్రజలు నిర్భీతితో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా, ఎన్నికలు సజావుగా జరగడానికి,  పోలీసుల నిరంతర శ్రమిస్తూ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని కమీషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు.