Jagtial Bandh: జగిత్యాలలో బంద్.. అన్నీ మూసేశారు.. కారణం ఏంటంటే..

Jagtial Bandh: జగిత్యాలలో బంద్.. అన్నీ మూసేశారు.. కారణం ఏంటంటే..

జగిత్యాల జిల్లా: నేడు జగిత్యాల పట్టణంలో బంద్ నడుస్తోంది. బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ జగిత్యాల హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో బంద్ జరుగుతోంది. జగిత్యాల పట్టణంతో పాటు రాయికల్ మున్సిపల్లో కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బంద్ కారణంగా పట్టణంలోని హోటల్స్, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, షాపింగ్ సెంటర్లు, సినిమా థియేటర్లు మూతబడ్డాయి. పట్టణంలోని వ్యాపార వాణిజ్య కేంద్రాలలో  కలియ తిరుగుతూ బంద్కు సహకరించాలని హిందు సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రముఖ కూడళ్లలో భారీగా మోహరించారు.

బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. ఇండియాకు పారిపోయి వచ్చిన తర్వాత ఆ దేశంలోని మైనార్టీలపై దాడులు మొదలయ్యాయి. అల్లరి మూకలు హిందువులు లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నాయి. ఇండ్లను తగులబెడుతూ, ఆలయాలను ధ్వంసం చేస్తున్నాయి. హిందువులపై ఇప్పటి వరకు 52 జిల్లాల్లో 205 దాడులు జరిగాయని హిందూ సంస్థలు పేర్కొన్నాయి. ఈ దాడులను అరికట్టాలని కోరుతూ  ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్కు లేఖ రాశాయి.

మైనార్టీలపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్ ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ ఖండించారు. ఇది చాలా దారుణమని ఆయన అన్నారు. హిందువులు, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్ లను దాడుల నుంచి కాపాడాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ‘‘వాళ్లు మన దేశ ప్రజలు కాదా? దేశాన్ని కాపాడగలిగిన మీరు.. కొన్ని కుటుంబాలను కాపాడలేరా? ఎలాంటి హాని జరగనివ్వబోమని వాళ్లకు భరోసా ఇవ్వండి. వాళ్లంతా మనోళ్లే.. మనందరం కలిసి కొట్లాడుదాం.. కలిసి ఉందాం” అని విద్యార్థులకు యూనస్ పిలుపునిచ్చారు.