న్యూఢిల్లీ: టీమిండియాతో జులై చివర్లో ఆరు మ్యాచ్ల లిమిటెడ్ ఓవర్ల సిరీస్కు ఆతిథ్యం ఇస్తామని బీసీసీఐకి శ్రీలంక ప్రతిపాదించింది. ఇండియా గవర్నమెంట్ అనుమతిస్తే.. లంక వెళ్లేందుకు రెడీ అని బోర్డు ప్రకటించింది. అదే జరిగితే ఇండియా క్రికెటర్లు కాంపిటీటివ్ క్రికెట్లోకి తిరిగి వచ్చేవారు. అలాగే, కరోనా తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ తిరిగి ప్రారంభమయ్యేది. కానీ, టీమిండియా క్రికెటర్లు తిరిగి శిక్షణ ప్రారంభించే విషయంలో బీసీసీఐ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు. ఒలింపిక్ క్రీడల విషయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) వివిధ స్పోర్ట్స్ ఫెడరేషన్లతో చర్చలు జరిపింది. అథ్లెట్లు ట్రెయినింగ్ ప్రారంభించడం కోసం కొత్త ప్రొటోకాల్స్ రూపొందించి ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో నివేదిక ఇచ్చింది. బోర్డు మాత్రం ఓ ప్లాన్తో ఇప్పటిదాకా సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీని సంప్రదించలేదు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ అర్ధంతరంగా రద్దయిన తర్వాత ఇండియాలో క్రికెట్ ఆగిపోయింది. మార్చి 25వ తేదీ నుంచి క్రికెటర్లంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. నెట్స్, ఫిట్నెస్ డ్రిల్స్ కోసం స్థలం అందుబాటులో లేకపోవడంతో తమ ఇళ్లలో ఉన్న సౌకర్యాలతోనే ప్లేయర్లు కసరత్తులు చేస్తున్నారు.‘లాక్డౌన్ 4 కు సంబంధించి గవర్నమెంట్ గైడ్లైన్స్ కోసం మేం వెయిట్ చేశాం. అవి రాకముందే మేం ప్రభుతాన్ని సంప్రదిస్తే.. దేశంలో ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడకముందే క్రికెట్ మొదలవ్వాలని కోరుతున్నామని అంటారు. అయితే, క్రికెట్ను రీస్టార్ట్ చేసేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేయడం కోసం బీసీసీఐలో అంతర్గత చర్చలు జరుగుతున్నాయి’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని బోర్డు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అయితే, ఈ నెలాఖరు వరకూ లాక్డౌన్ పొడిగించిన కేంద్రం స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. దాంతో, ఆటగాళ్లలో ఆశలు చిగురించాయి.
స్పోర్ట్స్ ఈవెంట్లకు మాత్రం అనుమతి రాలేదు.
ఒకే సెంటర్లో అందరికీ శిక్షణ?
దేశంలోని పలు నగరాల్లో ఉన్న టీమిండియా క్రికెటర్లందరినీ ఒక్క చోటుకు చేర్చి ట్రెయినింగ్ ఇవ్వాలన్నది ఒక ఆప్షన్గా తెలుస్తోంది. ఇందుకోసం గ్రీన్జోన్లో ఉన్న ఒక ట్రెయినింగ్ సెంటర్ లేదంటే ఓ క్రికెట్ గ్రౌండ్ను ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకే సెంటర్లో క్రికెటర్లకు ట్రెయినింగ్ ఇవ్వాలంటే.. అందరి కళ్లూ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) వైపే వెళ్తాయి. అయితే, బెంగళూరు సిటీ ప్రస్తుతం రెడ్ జోన్లో ఉన్న నేపథ్యంలో బోర్డు ఆ రాష్ట్ర అధికార యంత్రాంగంతో చర్చించిన తర్వాత ఓ నిర్ణయానికి రావొచ్చు. లాక్డౌన్–4 నిబంధనల్లో రాష్ట్రాల మధ్య ప్రయాణానికి ప్రభుత్వం అనుమతించింది. అలాగే, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, స్టేడియాలు తెరవొచ్చని.. ప్రేక్షకులకు మాత్రం అనుమతి లేదని చెప్పింది. కానీ, ప్లేయర్ల శిక్షణ విషయాన్ని మాత్రం గైడ్లైన్స్లో ప్రస్తావించలేదు. ఒకవేళ ట్రెయినింగ్కు అనుమతి లభిస్తే.. వివిధ నగరాల్లో ఉన్న ప్లేయర్లను బీసీసీఐ ఒక్క చోటుకు చేరుస్తుందా? లేదా? అన్నది చూడాలి.
రెండుసార్లు కరోనా టెస్టులు!
స్టేడియం లేదా ట్రెయినింగ్ సెంటర్లోని ఎక్విప్మెంట్ను శానిటైజ్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు గానీ.. బుండెస్లిగా లీగ్ ట్రెయినింగ్ క్యాంప్లో ఇద్దరు ప్లేయర్లకు కరోనా సోకినట్టు.. మన ప్లేయర్లకూ ప్రమాదం వాటిల్లితే పరిస్థితి ఏమిటని ఓ అధికారి ప్రశ్నిస్తున్నారు. అందువల్ల ట్రెయినింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఒకవేళ ప్లేయర్లంతా ఒక క్యాంప్కు వచ్చేందుకు అనుమతి లభిస్తే, అందరికీ రెండు సార్లు కరోనా టెస్టులు చేసిన తర్వాతే క్యాంప్లోకి తీసుకోవాలని సూచించారు. ‘కొన్నిసార్లు తప్పుడు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకే టెస్టు సరిపోదు. అందువల్ల రెండోసారి పరీక్షలు చేసిన తర్వాత ట్రెయినింగ్ స్టార్ట్ చేయాలి. క్రికెటర్లు బస చేసే హోటల్ సిబ్బందికి కూడా కరోనా టెస్టులు చేయాలి. అక్కడి నుంచి ఎవ్వరూ బయటికి వెళ్లకుండా, బయటివాళ్లు లోపలికి రాకుండా చూసుకోవాలి. అలాగే ట్రెయినింగ్ సెంటర్లో ప్లేయర్లకు సహకరించే సిబ్బందికి కూడా టెస్టులు చేయాల్సిందే. ఇదంతా చాలా పెద్ద పని’ అని అభిప్రాయపడ్డారు.
ఫిట్నెస్ ఓకే కానీ..
లాక్డౌన్ టైమ్లో టీమిండియా ప్లేయర్లను కోచింగ్ స్టాఫ్ ఆన్లైన్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇంట్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలతో సాధన చేసేలా కొన్ని డ్రిల్స్ రూపొందించారు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లంద రికీ ప్రత్యేక యాప్ను అందుబాటులో ఉంచారు. దాని ద్వారా టీమ్ ఫిజియో, ట్రెయినర్ ఇచ్చే సూచనలు పాటిస్తూ క్రికెటర్లు ఫిట్నెస్ డ్రిల్స్ చేస్తున్నారు. అయితే, ఇవన్నీ ఫిట్నెస్కు, ఫిజికల్ కండిషనింగ్కు సంబంధించినవే. దాదాపు రెండు నెలలుగా స్కిల్స్ ట్రెయి నింగ్కు దూరమ య్యారు. ఇటీవల షమీతో ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో రోహిత్ శర్మ ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘నేను మూడు నెలలుగా బ్యాట్ పట్టుకోలేదు. మేం అపార్ట్మెంట్లలో నివసిస్తాం. ఎక్కువ ఖాళీ ప్లేస్ లేదు. బాల్కనీలో సాధ్యమైన ఫిట్నెస్ ట్రెయినింగ్ చేస్తున్నా. నెల, నెలన్నర రోజుల్లో మేం తిరిగి ట్రెయినింగ్ ప్రారంభిస్తామని భావిస్తున్నా’ అని రోహిత్ చెప్పాడు. మరి, బోర్డు ఏం చేస్తుందో చూడాలి.
ఐపీఎల్ కు లైన్ క్లియర్ అయినట్లే
.