- ఖజానా నింపుకునేందుకే సర్కార్ ఎత్తులని విమర్శలు
- కరోనా కష్టాల్లో జనం నడ్డివిరుస్తోందని మండిపాటు
- జీవో 131ను రద్దు చేయాలని డిమాండ్
వెలుగు నెట్వర్క్: టీఆర్ఎస్ సర్కార్ ప్రజలను దోచుకునేందుకే ఎల్ఆర్ఎస్ తెచ్చిందని బీజేపీ విమర్శించింది. కరోనా ఎఫెక్ట్తో కష్టాల్లో ఉన్న ప్రజల నడ్డివిరిచేలా ఉన్న జీవో నంబర్131ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని తహసీల్దార్ ఆఫీసుల ఎదుట బీజేపీ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టింది. ఖమ్మంలో ఆర్అండ్ బీ గెస్టు హౌస్ నుంచి భారీ ర్యాలీ తీశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఇందులో పాల్గొని, ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఆసిఫాబాద్లో ర్యాలీగా వెళ్లిన లీడర్లు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఎల్ఆర్ఎస్ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ మెయిన్ గేట్ ఎక్కి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే ధర్నాకు దిగారు. అనంతరం కలెక్టర్ సందీప్కుమార్ ఝాకు వినతిపత్రం ఇచ్చారు. నిర్మల్లో బీజేపీ, కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్, ఖానాపూర్లో ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్, సిర్పూర్టీలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. నల్గొండ జిల్లా తిప్పర్తిలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా, సూర్యాపేటలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లగుంట్ల అయోధ్య పాల్గొన్నారు. వరంగల్లో అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ రావుల పద్మ పాల్గొని ప్రభుత్వం తన ఖజానాను నింపుకునేందుకే ఎల్ఆర్ఎస్ తెచ్చిందని విమర్శించారు.