మహిళలకు 33% రిజర్వేషన్లు

మహిళలకు 33% రిజర్వేషన్లు

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేస్తామని ప్రకటించింది. ఈనెల 12న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పార్టీ మేనిఫెస్టోను సంకల్ప్ పత్ర్ పేరుతో విడుదల చేశారు. మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇందులో 11 అంశాలను ప్రస్తావించారు. తాము ఇచ్చిన హామీలు ఉచితాలు కాదని.. సాధికారతకు, ప్రలోభాలకు తేడా ఉందని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సాధికారత కోసం బీజేపీ పని చేస్తుందని, ప్రలోభాలకు, ఉచితాలకు తమ పార్టీ వ్యతిరేకమని చెప్పారు. శనివారం కాంగ్రెస్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోకు దశ, దిశ లేదని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోల మధ్య పోలికే లేదన్నారు. పెద్దపెద్ద హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని, కానీ వాటిని అమలు చేసే ఉద్దేశం ఆ పార్టీకి లేదని అన్నారు. 2017లో రాజస్థాన్, చత్తీస్‌‌గఢ్‌‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయలేదని ఆరోపించారు. పాత పెన్షన్ స్కీమ్‌‌(ఓపీఎస్‌‌)ను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై బీజేపీ నేత మంగళ్ పాండే స్పందించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ప్రజలు చరిత్రను మారుస్తరు
హిమాచల్‌‌లో ఐదేండ్లకోసారి అధికారం మారుతుండగా.. ఈసారి తమను గెలిపించి ప్రజలు చరిత్ర ను మారుస్తారని నడ్డా ఆశాభావం వ్యక్తంచేశారు. ఉత్తరాఖండ్‌‌, గోవా, యూపీలలో ప్రజలు సంప్రదాయాన్ని మార్చారని, హిమాచల్‌‌లోనూ అదే జరుగుతుందని చెప్పారు. ‘‘ఇచ్చిన హామీలతో పాటు, చేయని వాగ్దానాలను అమలు చేశాం” అని అన్నారు.