బీఆర్ఎస్​ హయాంలోనే సర్పంచ్​పై కేసు

బీఆర్ఎస్​ హయాంలోనే సర్పంచ్​పై కేసు
  •     మీ ఫ్రెండ్లీ పోలీసులే కేసు పెట్టారు
  •     పారిపోయాడని కోర్టుకు చెప్పారు 
  •     కొడుకును పోగొట్టుకున్న తల్లిని పరామర్శించరా? 
  •     ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్​

జగిత్యాల టౌన్, వెలుగు : జగిత్యాల రూరల్​మండలంలో ఉన్న హబ్సిపూర్ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్​ నేత జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం ఇందిరాభవన్ లో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్​ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సర్పంచ్​పై కేసు నమోదైందని, అయినా పోలీసులు అరెస్ట్ చేయలేదన్నారు. 

నిందితుడు పరారీలో ఉన్నాడని కోర్టుకు చెప్పారని, పరారీలో ఉన్న వ్యక్తి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా పాల్గొన్నాడో చెప్పాలని ప్రశ్నించారు. ఆ కేసులో పోలీసులు ఎవరికీ ఫ్రెండ్లీగా పని చేసారో అందరికీ తెలుసన్నారు. నిరుపేద నిరుద్యోగ యువకుడి ఇంటిపై ముగ్గురు దాడి చేస్తే బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పోలీసులు స్పందించలేదని, దీంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఇందులో సర్పంచ్​ రాజేశ్వర్ ​రెడ్డి నిందితుడిగా ఉన్నాడన్నారు. కేసు విచారణలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని, ఎస్పీ ఎంక్వైరీ చేపట్టాలని డిమాండ్ చేశారు. జాగృతి మహిళా అధ్యక్షురాలు కవిత నిందితులను పరామర్శించారని, కానీ పాతికేండ్ల కొడుకు చనిపోయిన బాధలో ఉన్న తల్లిని, ఆ కుటుంబాన్ని మాత్రం పరామర్శించలేదన్నారు. 2014కు ముందు కేసీఆర్, కేటీఆర్, కవిత స్థితి..ఇప్పటి స్థితి అన్నీ బయటకు వస్తాయన్నారు.