కాసేపట్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కాసేపట్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమైంది. మార్చి 29వ తేదీని కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) షెడ్యూల్‌ విడుదల చేయనుంది. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. కర్నాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనున్న నేపథ్యంలో ఏ క్షణమైన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటికే పలు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ప్రచారపర్వంలో దూసుకుపోతున్నాయి.

కర్నాటకలో ఎన్నికల వేళ జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం జాతీయ పార్టీలు  కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే తమను సంప్రదించాయని చెప్పారు. అయితే ఆ రెండు పార్టీలను తాము దూరం పెట్టినట్లుగా తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నారు. గతంలో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుని విసిగిపోయామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తాము సొంతంగానే పోటీ చేసి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. 

గత ఎన్నికల్లో బీజేపీ (BJP) 104 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ (Congress) 78 సీట్లు, జేడీఎస్ (JDS) 37 సీట్లలో గెలుపొందాయి. మరో ముగ్గురు ఇతరులు విజయం సాధించారు. ముందుగా కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే సరిగ్గా ఏడాదిన్నర కూడా ఆ ప్రభుత్వం నిలబడలేదు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో సొంతంగా అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్.. తొలి జాబితాను ప్రకటించింది. ఈ నెల 25న 124 మందికి టికెట్ కేటాయిస్తూ తొలి జాబితాను విడుదల చేసింది.

రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నుంచి పోటీ చేస్తుండగా, వరుణ నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కోలార్ నుంచి ఆయన కుమారుడు, కొరటగెరె నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర, దేవనహళ్లి నుంచి మాజీ మంత్రులు కేహెచ్ మునియప్ప, చితాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పోటీ చేయనున్నారు.

2023లో మొత్తం 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే నాగాలాండ్‌, త్రిపుర, మేఘాలయా రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. తాజాగా కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. ఇక మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‍గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.