విస్తరిస్తున్న కోవిడ్ వైరస్ 19 పై నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని అప్రమత్త చర్యలు చేపట్టింది. వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా.. మంత్రులు, అధికారులు ,ప్రభుత్వ కార్యాలయాలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిల్లో ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ స్కానర్ లు ఏర్పాటు చేయాలని చెప్పింది. తప్పనిసరిగా శానిటైజర్ లు ఏర్పాటు చేయాలని సూచించింది.
అన్ని పాస్ లను రద్దు చేయాలి
ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉంటే చికిత్స అందిస్తూ వారిని క్వారంటైన్ కు తరలించాలని చెప్పింది కేంద్రం. కార్యాలయాలకు వచ్చే సందర్శకుల సంఖ్యను కట్టడి చేయాలని తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చే విజిటర్ పాస్ లను వెంటనే రద్దు చేయాలని, అధికారుల అనుమతితో వచ్చే సందర్శకులను స్ర్కినింగ్ తరువాతే లోనికి అనుమతించాలని సూచించింది.
సమావేశాలుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలి
ఏవైనా సమావేశాలుంటే వీలైనంత వరకు వీడియో కాన్ఫరెన్స్ లకే పరిమితం చేయాలని, తప్పనిసరి అయితే తప్ప తక్కువ మంది తోనే ప్రభుత్వ సమీక్షలు, సమావేశాలు ఉండాలని పేర్కొంది. అవసరం లేని అధికారిక ప్రయాణాలు రద్దు చేసుకోవాలని చెప్పింది.అవసరమైన సమాచారాన్ని ఇతర కార్యాలయాలకు ఫైల్స్,డాక్యుమెంట్ల రూపంలో పంపించకుండా ఈ మెయిల్ ను ఉపయోగించుకోవాలని తెలిపింది.
దరఖాస్తులు బయటినుండే ఇవ్వాలి
ప్రభుత్వ కార్యాలయాల ఎంట్రీ పాయింట్ వద్ద నుండే దరఖాస్తులు తీసుకోవడం, ఇవ్వడం చేయాలని కేంద్రం సూచించింది. కార్యాలయాల ఆవరణలో ఉన్న జిమ్స్, శిశు సంరక్షణ కేంద్రాలను మూసివేయాలని చెప్పింది. ఉద్యోగులు పనిచేసే చోట తరుచుగా శుభ్రం చేయాలని, శానిటేషన్ చేసుకోవాలని తెలిపింది. ప్రభుత్వ కార్యాలయంలోని వాష్ రూమ్, టాయిలెట్ లలో రెగ్యులర్ గా శానిటైజర్లు, సబ్బులు, నిరంతరం నీటి సరఫరా ఉండేలా చూసుకోవాలని పేర్కొంది.
మీ ఆరోగ్యం మీరే పరిరక్షణ చేసుకోవాలి
ఎవరి ఆరోగ్యం వారే పరిరక్షించుకోవాలని ఆఫీస్ లలో పని చేసే అధికారులందరికీ కేంద్రం సలహా ఇచ్చింది. శ్వాస సంబంధమైన ఇబ్బందులు, జ్వరం, అస్వస్థత ఏదైనా ఉంటే పని ప్రదేశం నుండి వెళ్లిపోవాలని, ఆ తరువాత పై అధికారులకు తెలియజేయాలని చెప్పింది. అస్వస్థతకు గురై సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నవారి రిక్వెస్ట్ మేరకు పై అధికారులు వెంటనే సెలవు మంజూరు చేయాలని సూచించింది. సీనియర్ ఉద్యోగులు,గర్భిణీ మహిళ ఉద్యోగులు సీరియస్ రోగాలు కండిషన్ ఉన్న ఉద్యోగులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని, అలాంటి ఉద్యోగులను ప్రజలతో నిత్యం కలిసే పనులను అప్పగించవచ్చని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.