మీడియా అనుమతులు  మరింత ఈజీగా

మీడియా అనుమతులు  మరింత ఈజీగా
  • ఇకపై లైసెన్సులు, అనుమతులు, రిజిస్ట్రేషన్లన్నీ అందులోనే
  • ప్రారంభించిన కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​

న్యూఢిల్లీ: డిజిటల్​ ఇండియాలో భాగంగా బ్రాడ్​కాస్టింగ్​ బిజినెస్​నూ మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇకపై మీడియా చానళ్ల లైసెన్సులు, అనుమతులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎలాంటి శ్రమ లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు   ‘బ్రాడ్​కాస్ట్​ సేవా పోర్టల్’​ను తీసుకొచ్చింది. సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆ పోర్టల్​ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ ప్రారంభించారు. బ్రాడ్​కాస్టింగ్​ వ్యవస్థలో మరింత పారదర్శకత, బాధ్యతను పెంచేందుకు వీలుగా టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నామన్నారు. ‘బ్రాడ్​కాస్ట్​ సేవా పోర్టల్​’ ద్వారా అతి తక్కువ టైంలోనే అప్లికేషన్​ పెట్టుకుని అనుమతులు పొందేందుకు వీలుంటుందన్నారు. అంతేకాకుండా దరఖాస్తుపై అనుమతుల ప్రక్రియ ఎంతవరకొచ్చిందో అప్లికెంట్లు తెలుసుకోవచ్చన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సిద్ధాంతమైన ‘మినిమమ్​ గవర్నమెంట్​ మ్యాగ్జిమమ్​ గవర్నెన్స్​’కు ఈ పోర్టల్​ ముందడుగని చెప్పారు. దీని ద్వారా 900 శాటిలైట్​ టీవీ చానళ్లు, 70 టెలీపోర్ట్​ ఆపరేటర్లు, 1,700 మల్టీ సర్వీస్​ ఆపరేటర్లు, 350 కమ్యూనిటీ రేడియో స్టేషన్లు, 380 ప్రైవేట్​ ఎఫ్​ఎం చానళ్లకు లబ్ధి కలుగుతుందని పేర్కొన్నారు. పోర్టల్​పై చేసిన టెస్ట్​ రన్​ విజయవంతమైందని, అందరి నుంచి మంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. త్వరలోనే నేషనల్​ సింగిల్​ విండో సిస్టమ్​కు ‘బ్రాడ్​ కాస్ట్​ సేవా పోర్టల్​’ను అనుసంధానిస్తామని అనురాగ్​ ఠాకూర్​ తెలిపారు. 

పోర్టల్​తో ఇవీ లాభాలు

  • అప్లికేషన్లపై ఎండ్​ టు ఎండ్​ ప్రాసెసింగ్​
  • పేమెంట్​ వ్యవస్థలతో అనుసంధానం (భారత్​ కోష్ )
  • ఈ–ఆఫీస్​, భాగస్వామ్య శాఖలతో అనుసంధానం
  • అనలిటిక్స్​, రిపోర్టింగ్​, మేనేజ్​మెంట్​ ఇన్ఫర్మేషన్​ సిస్టమ్​
  • ఇంటిగ్రేటెడ్​ హెల్ప్​ డెస్క్​
  • అప్లికేషన్​ ఫారాలు.. దరఖాస్తు స్టేటస్​ ట్రాకింగ్​
  • పోర్టల్​ నుంచే అనుమతులు, లైసెన్స్​, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన లెటర్లు, ఆర్డర్ల డౌన్​లోడింగ్​
  • మెసేజ్​, మెయిల్​ ద్వారా భాగస్వాములకు అలర్ట్‌‌లు.