సదర్​ దివానీ అదాలత్..తెలంగాణ జాబ్స్​ స్పెషల్​

సదర్​ దివానీ అదాలత్..తెలంగాణ జాబ్స్​ స్పెషల్​

భారతదేశంలో విద్యావ్యాప్తికి 1813 చార్టర్​ చట్టం ప్రకారం మొదటిసారిగా లక్ష రూపాయలను కేటాయించింది. 1835లో భారత్​లో ఇంగ్లీష్​ భాషను భాషా మాధ్యమంగా ప్రకటించారు. 1835లోనే మెకాలే విద్యకు సంబంధించి ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. దీనికే మెకాలే మినిట్​ అనే పేరు. దీని ప్రకారం ఆంగ్ల మాధ్యమం అధికారికంగా గుర్తించబడింది. ఆ తర్వాత 1844లో ఈస్టిండియా కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు. తప్పనిసరిగా ఆంగ్ల భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలని హార్డింజ్​ ప్రకటించారు. బొంబాయి, మద్రాస్, బెంగాల్​, పంజాబ్​ రాష్ట్రాల్లో 1855లో ప్రత్యేక విద్యా విభాగాల ఏర్పాటయ్యాయి. విద్యారంగంలో ఉన్నత పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి 1897లో ఇండియన్​ ఎడ్యుకేషన్​ సర్వీసు ఏర్పడింది. 

అధోముఖగాలన సిద్ధాంతం: బ్రిటిష్​ వారి ఆధునిక విద్య ఉన్నత, మధ్య తరగతికి చెందిన కొద్దిమందికి మాత్రమే పరిమితమని, ఈ విద్య పొందిన వీరు మిగతా ప్రజలను ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, వెనుకబడిన ప్రజలను విద్యావంతులను చేయాలని ప్రతిపాదించిందే ఈ సిద్ధాంతం.

ఆడమ్స్​ రిపోర్ట్​: 1835లో విలియం బెంటింక్​ బెంగాల్​, బిహార్​ ప్రాంతాల్ల విద్య స్థితిగతులను సర్వేచేసి నివేదిక సమర్పించాలని విలియం ఆడమ్స్​ కోరారు. ఈ విషయమై మూడు నివేదికల రూపంలో ఆడమ్స్​ నివేదిక సమర్పించారు. 

ఉడ్స్​ డిస్పాచ్​: ఈ డ్రాప్ట్​ను 1835లో ఎడ్యుకేషన్​ బోర్డుకు అధ్యక్షుడైన చార్లెస్​ ఉడ్​ రూపొందించగా 1854 జులై 19న భారత్​కు వచ్చింది. దీన్నే మాగ్నాకార్టా ఆఫ్​ ఇంగ్లీష్​ ఎడ్యుకేషన్​, ఇంటలెక్చువల్​ చార్టర్​ ఆఫ్​ ఇండియాగా పిలుస్తారు. ఇది విద్య అందరికీ అందుబాటులో ఉండాలని ప్రతిపాదించింది. ఉడ్స్​ డిస్పాచ్​ ప్రకారం విద్య లక్ష్యం సంప్రదాయ భారతీయ విద్యా విధానంలో శాస్త్రీయతను, హేతువాదాన్ని జోడించడమే. ఇది అధోముఖ గాలన సిద్ధాంతాన్ని తిరస్కరించింది. ప్రాథమిక, స్త్రీ, వృత్తి విద్యలు, సాంకేతిక విద్యల గురించి కూడా ప్రస్తావిస్తూ విద్యావిధానపరంగా విప్లవాత్మకమైన మార్పులను ప్రతిపాదించింది. 

థామస్​ ర్యాలీ కమిషన్​: థామస్​ ర్యాలీ వైస్రాయ్​ ఎగ్జిక్యూటివ్​ కౌన్సిల్​లో ఒక న్యాయ సభ్యుడు. లార్డ్​ కర్జన్ 1902లో థామస్​ ర్యాలీ చైర్మన్​గా కమిషన్​ ఏర్పాటు చేశాడు. ఒకే ఒక భారతీయ సభ్యుడిగా సయ్యద్​ హుస్సేన్​ బిల్​గ్రామి ఉన్నాడు. దీనిని యూనివర్సిటీ విద్యావిధానాన్ని సమీక్షించడానికి ఏర్పాటు చేశారు. విద్యాలయాలు ప్రభుత్వ యాజమాన్యంలోనే పనిచేయాలని ప్రతిపాదించింది. ఈ కమిటీ సిఫారసు మేరకు 1904 విశ్వవిద్యాలయ చట్టాన్ని చేశారు. 

సాండ్లర్​ కమిటీ: డిగ్రీ స్థాయిలో డిగ్రీ కోర్సు కాలపరిమితిని మూడేండ్లుగా నిర్ణయించింది. 

హర్టోగ్​ కమిటీ: పాఠశాల విద్య, ఉన్నత విద్యకు ప్రత్యేకంగా బోర్డులు ఉండాలని ప్రతిపాదించింది.

సఫ్రూ కమిటీ: వృత్తి విద్య ప్రాముఖ్యతను తెలియజేసింది. 

వార్ధా విద్యావిధానం: భారతదేశంలో ఎలాంటి విద్యావిధానం ఉండాలో అనే అంశాలను హరిజన్​, యంగ్​ ఇండియా పత్రికల్లో మహాత్మాగాంధీ వ్యాసరూపంగా తెలియజేశాడు. ఇది గాంధీజీ భావాలకు అనుగుణంగా రూపొందించిన విద్యావిధానం. ఈ విద్యావిధానం సహ జీవనానికి, సాంఘిక సమతుల్యత, వృత్తివిద్య, విలువలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ విద్యా విధానానికి మరో పేరు నయీతాలీమ్​. దీనిపై చర్చించడానికి ఏర్పాటు చేసిన వార్ధా సమావేశానికి జాకీర్​ హుస్సేన్​ అధ్యక్షత వహించాడు. 

సార్జంట్​ కమిషన్​: కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ తరహా విద్యావిధానంలో విద్యను భారతదేశంలో అభివృద్ధిపరచాలని సూచించింది. 1919 మాంటేగ్​ ఛెమ్స్​ఫర్డ్​ సంస్కరణల ద్వారా మొదటిసారిగా విద్య భారతీయుల ఆధీనంలోకి వచ్చింది.  

సివిల్​ సర్వీసెస్​ సంస్కరణలు 

మొదట్లో ఈస్ట్​ ఇండియా కంపెనీ వర్తకులు సివిల్​ సర్వెంట్స్​గా పిలువబడ్డారు. 1772లో వారెన్​ హేస్టింగ్స్​ సివిల్​ సర్వీసెస్​ వ్యవస్థకు పునాదులు వేశాడు. సివిల్​ సర్వీసెస్​ వ్యవస్థను ఆధునికీకరించి అందులో సంస్కరణకు కారణమైనందున కారన్​వాలీస్​ను సివిల్​ సర్వీస్​ వ్యవస్థ పితామహుడిగా పిలుస్తారు. 1806 నుంచి వాస్తవంగా సివిల్​ సర్వీస్​ ఉద్యోగులకు లండన్​లోని హైలీబరీలోని ఈస్టిండియా కళాశాలల్లో రెండేండ్లు శిక్షణ ఇచ్చేవారు. పోటీపరీక్షను బోర్డ్​ ఆఫ్​ కంట్రోల్​ పర్యవేక్షణలో మొదటగా 1854 నుంచి నిర్వహించడమైంది. 1858 నుంచి హైలీబరీలోని ఈస్టిండియా కళాశాల స్థానంలో పరీక్షల శిక్షణ సివిల్​ సర్వీస్​ కమిషనర్ల చేతిలోకి వెళ్లాయి. 

అచిన్​​సన్​ కమిషన్​: సివిల్​ సర్వీసు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు వైశ్రాయ్​ లార్డ్​ డఫ్రీన్​ ఈ కమిటీని నియమించాడు. అచిన్​ సన్​ కమిటీ సిఫారసుల మేరకు ఇండియన్​ సివిల్​ సర్వీసెస్​ పరీక్షలు లండన్​లో మాత్ర మే నిర్వహించారు. సివిల్​ సర్వీస్​ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 23 సంవత్సరాలుగా నిర్ణయించింది. 

మాంట్​ఫోర్డ్​ సంస్కరణలు: సివిల్స్​ పరీక్షలు ఇంగ్లాండ్​, ఇండియాల్లో ఒకేసారి జరగాలి. 1/3 వంతు భర్తీ ప్రక్రియను ఇండియాలోనే నిర్వహించాలి. 

లీ కమిషన్​: వైశ్రాయ్​ లార్డ్​ రీడింగ్​ కాలంలో ఈ కమిషన్​ నియమించబడింది. దీనిప్రకారం సివిల్​ సర్వీస్​ నియామకాల్లో భారతీయులకు 50శాతం కేటాయించాలి. సివిల్​ సర్వెంట్ల నియామకం కోసం ఒక స్వయం ప్రతిపత్తిగల సంస్థను ఏర్పాటు చేయాలి. ఇందులో భాగంగానే దేశంలో మొదటగా 1926 అక్టోబర్​ 1న పబ్లిక్​ సర్వీస్​ కమిషన్ ఢిల్లీలో ఏర్పడింది. దీనికి మొదటి చైర్మన్​గా రాస్​ బార్కర్​ 
నియామకమయ్యారు. 

న్యాయ సంస్కరణలు

ఆధునిక భారతదేశంలో న్యాయవ్యవస్థ వారెన్​ హేస్టింగ్స్​ కాలం నుంచి అభివృద్ధి చెందింది. 

గవర్నర్ జనరల్స్​, వైశ్రాయ్​ల పాత్ర 

వారెన్​ హేస్టింగ్స్​: భారతదేశంలో న్యాయవ్యవస్థపై శ్రద్ధచూపిన మొదటి గవర్నర్​ జనరల్​ వారెన్​ హేస్టింగ్స్. ఈయన స్థానిక వివాదాల పరిష్కారానికి మున్సిఫ్​ కోర్టులను ఏర్పాటు చేశాడు. జిల్లా స్థాయిలో సివిల్​ కేసుల పరిష్కారానికి దివాని న్యాయస్థానాలను, క్రిమినల్​ కేసుల పరిష్కారానికి నిజామత్​ న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. కేంద్రస్థాయిలో సివిల్​ కేసుల పరిష్కారానికి సదర్​ దివానీ అదాలత్​, క్రిమినల్​ కేసుల పరిష్కారానికి సదర్​ నిజామత్​ అదాలత్​లను ఏర్పాటు చేశారు. 

కారన్​వాలీస్​: 1793లో లార్డ్​ కారన్​వాలీస్​ కలెక్టర్ల చేతుల్లో కేంద్రీకృతమైన అధికారాలు చూసి అన్ని అధికారాలు కలెక్టర్ల వద్ద ఉండాల్సిన అవసరం లేదని భావించి మెజిస్టీరియల్​ అధికారాలను తొలగించాడు. ఇతను ఆధునిక భారత న్యాయవ్యవస్థలో పలు సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగానే కారన్​వాలీస్​ కోడ్​ అనే న్యాయ నియమావళిని ప్రవేశపెట్టాడు. పాట్నా, ఢాకా, ముర్షిదాబాద్​, కలకత్తాల్లో నాలుగు సర్క్యూట్​ కోర్టులు ఏర్పాటు చేశాడు. అదేవిధంగా తీర్పులను భద్రపరిచే విధానం ప్రవేశపెట్టాడు. 

విలియమ్​ బెంటింక్​: ఇతని కాలంలో 1833 చార్టర్​ చట్టానికి అనుగుణంగా లార్డ్​ మెకాలే (18 34)  చైర్మన్​గా మొదటి లా కమిషన్​ ఏర్పడింది.

లార్డ్​ కానింగ్​: ఇతని కాలంలో 1859లో ఇండియన్​ సివిల్​ ప్రొసీజర్​ కోడ్​, 1860లో ఇండియన్​ పీనల్​ కోడ్​, 1861లో ఇండియన్​ క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ ప్రవేశపెట్టారు. 

లార్డ్​ ఎల్జిన్​: 1861లో వచ్చిన హైకోర్టుల చట్టం ప్రకారం ఇతను 1862లో మద్రాసు, కలకత్తా, బొంబాయిల్లో హైకోర్టులను ఏర్పాటు చేశాడు. 

సర్​ జాన్​ లారెన్స్​: లార్డ్​ ఎల్జిన్​ కాలంలో ఏర్పాటు చేసిన హైకోర్టులను ఇతను 1865లో ప్రారంభించాడు. 1866లో అలహాబాద్​లో ఒక హైకోర్టును ఏర్పాటు చేశాడు. 

లార్డ్​ రిప్పన్​: సమన్యాయ పాలనకు చిత్తశుద్ధితో ప్రయత్నించిన వైశ్రాయ్​ లార్డ్​ రిప్పన్​. ఇతను 1883లో ఇల్బర్​ బిల్లు ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం యూరోపియన్స్​ను భారతీయ మెజిస్ట్రేట్స్​ క్రిమినల్​ కేసులకు సంబంధించి విచారించవచ్చు.  భారతదేశంలో బ్రిటిష్​వారు పరిపాలనాపరంగా పలు సంస్కరణలను ప్రవేశపెట్టారు. అందులో విద్య, న్యాయ, సివిల్​ సర్వీసెస్​ సంస్కరణలు ముఖ్యమైనవి. విద్యా సంస్కరణల్లో భాగంగా పలు కమిటీలను ఏర్పాటు చేశారు. కొంతమంది గవర్నర్​ జనరళ్లు​, వైశ్రాయ్​లు న్యాయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ఐపీసీ, సీఆర్​పీసీలను రూపొందించారు. సివిల్​ సర్వీసెస్​ వ్యవస్థను ఆధునికీకరించి అందులో సంస్కరణకు కారణమైనందున కారన్​వాలీస్​ను సివిల్​ సర్వీస్​ వ్యవస్థ పితామహుడిగా పిలుస్తారు.