
తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్, సింగర్ సైంధవిలకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం (2025 సెప్టెంబర్ 30న) చెన్నై ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది. విడాకులు మంజూరు చేస్తూ కూతురు అన్విని సైంధవి వద్దే ఉండేటట్లు తీర్పునిచ్చింది. అందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని జీవీ ప్రకాశ్ కుమార్ కోర్టుకు తెలిపాడు.
చిన్న నాటి స్నేహితులైన జీవీ ప్రకాశ్, సైంధవి 2013లో వివాహం చేసుకున్నారు. తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు గతేడాది (2024) ప్రకటించారు. కొన్ని నెలల కూలింగ్-ఆఫ్ వ్యవధి తర్వాత ఈ ప్రక్రియను పూర్తి చేసింది కోర్టు. 2013లో లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట.. తమ 12 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికారు.
12 ఏళ్ల పాటు జీవీ ప్రకాశ్, సైంధవి వైవాహిక బంధంలో కొనసాగారు. అభిప్రాయ భేదాల కారణంగా ఈ ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. రెండు, మూడేళ్ల నుంచే జీవీ ప్రకాశ్, సైంధవి ఎవరికి వారే యమునా తీరే తరహాలో విడివిడిగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 2024లో విడాకులకు అప్లై చేయగా.. తాజా కోర్టు తీర్పుతో అధికారికంగా విడిపోయారు.
జీవీ ప్రకాశ్ కుమార్:
ఇండియాలోనే దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మేనల్లుడే ఈ జీవీ ప్రకాశ్ కుమార్. 1992లో శంకర్ డైరెక్షన్లో ఏఆర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన జెంటిల్మెన్ సినిమాతో జీవీ ప్రకాశ్ సింగింగ్ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేశాడు.
తెలుగులో జీవీ ప్రకాశ్ సంగీతం అందించిన ప్రభాస్ ‘డార్లింగ్’ సినిమా పాటలు సంగీత ప్రియులను ఎప్పటికీ అలరించే పాటలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో రీసెంట్గా నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమాకు కూడా జీవీ ప్రకాశ్ సంగీతం సమకూర్చాడు.
ఈ మధ్య చాలా తెలుగు సినిమాలకు జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు. నటుడిగా కూడా జీవీ ప్రకాశ్ పలు సినిమాల్లో నటించాడు. 2024 మార్చి 7న విడుదలైన ‘కింగ్ స్టన్’ సినిమాలో హీరో, సంగీతం, నిర్మాత కూడా జీవీ ప్రకాశే కావడం గమనార్హం.