హైదరాబాద్, వెలుగు: ఆటోల్లో ఆరుగురు స్కూల్ స్టూడెంట్లను మాత్రమే తీసుకువెళ్లేందుకు పర్మిషన్ ఉందని హైకోర్టుకు సిటీ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ తెలియజేశారు. 2005లో సికింద్రాబాద్ సెయింట్ఆన్స్ స్కూల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థిని చనిపోయింది. దాంతో ఆమె తండ్రి హన్మంతరావు హైకోర్టులో రిట్ వేశారు. విద్యార్థిని మృతి తర్వాత అధికారులు, సిటీలోని స్కూల్స్ మేనేజ్ మెంట్లతో సమావేశమయ్యామని ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ కోర్టుకు తెలిపారు.
స్కూల్ ఆటోల్లో ఆరుగురికే అనుమతి ఇవ్వాలని ఈ మీటింగ్లో డిసైడ్ చేశామన్నారు. ట్రాఫిక్పై స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇచ్చి అవగాహన కల్పించాలని, స్కూల్ బస్సు డ్రైవర్లకు ఐదేండ్ల అనుభవం తప్పని సరి చేశామని చెప్పారు. జీహెచ్ఎంసీ అధికారులు స్కూల్ జోన్ బోర్డులు ఏర్పాటు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే స్కూల్స్, బస్సులపై కేసులు పెడ్తామని తెలిపామని కోర్టుకు వివరించారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అమలు చేయాలని విద్యా శాఖ, ట్రాఫిక్ డిపార్ట్మెంట్లను ఆదేశించిన హైకోర్టు రిట్పై విచారణను క్లోజ్ చేసింది.