సెప్టెంబర్ 25 నుంచి కాంట్రాక్ట్​ లెక్చరర్ల సమ్మె

సెప్టెంబర్ 25 నుంచి కాంట్రాక్ట్​ లెక్చరర్ల సమ్మె
  • ఇయ్యాల్టి నుంచి కాంట్రాక్ట్​ లెక్చరర్ల సమ్మె 
  • రెగ్యులరైజ్ చేయాలన్న డిమాండ్​తో విధులకు దూరం

హైదరాబాద్, వెలుగు : దాదాపు నాలుగు నెలలుగా తమను రెగ్యులరైజ్ చేయాలని అన్ని వర్సిటీల్లో  నిరసనలు తెలుపుతున్న కాంట్రాక్టు లెక్చరర్లు సోమవారం నుంచి విధులు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీ కాలేజీల్లో పాఠాలు బంద్ చేసి, నిరవధిక సమ్మెలోకి పోవాలని డిసైడ్ అయ్యారు. ఆదివారం తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్టు లెక్చరర్స్ జేఏసీ సమావేశం జరిగింది. జేఏసీ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ లోథ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా12 సర్కారు వర్సిటీల్లో 1,445 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారని తెలిపారు. 

ఎన్నో ఏండ్ల నుంచి పనిచేస్తున్నా తమకు సరైన గుర్తింపులేదని చెప్పారు. డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసినట్టుగానే తమనూ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం అన్ని వర్సిటీల్లో నిరసన చేపడుతున్నా  ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. దీంతో సోమవారం నుంచి విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టనున్నట్లు వివరించారు. ఇప్పటికైనా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.