సెకండ్​ వేవ్​ ఉగ్రరూపం

సెకండ్​ వేవ్​ ఉగ్రరూపం

దేశంలో కరోనా సెకండ్ వేవ్​ దడ పుట్టిస్తోంది
మహారాష్ట్రలో భారీగా మరణాలు.. 
24 గంటల్లో 920 మంది బలి 
కర్నాటకలో కొత్తగా 50,112 
మందికి పాజిటివ్​.. అందులో 
సగం కేసులు బెంగళూరులోనే
లాక్​డౌన్​ దిశగా పలు రాష్ట్రాలు.. 
ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు
ఢిల్లీలో  ఫలిస్తున్న లాక్​డౌన్​.. 
కేసులు తగ్గుముఖం
ఒక్కరోజే దేశంలో 4.12 లక్షల కేసులు 


గత వారం రోజలుగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఫస్ట్​ టైమ్​ బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు  4 లక్షల 12 వేల 262  మందికి కరోనా సోకింది. ఈ నెల 1న 4,01,993 పాజిటివ్​ కేసులు రాగా.. ఇప్పుడు 11వేల కేసులు ఎక్కువగా వచ్చాయి. కొత్తగా దేశంలో 3,980 మంది కరోనాతో చనిపోయారు.  కరోనా కేసులు పెరిగి పోతుండటంతో చాలా రాష్ట్రాలు లాక్​డౌన్​ను అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. తాజాగా కేరళ, మధ్యప్రదేశ్​ కూడా లాక్​డౌన్​కు నిర్ణయం తీసుకున్నాయి. కొన్నిరోజుల నుంచి ఢిల్లీలో లాక్​డౌన్​ అమలవుతుండటంతో 15 రోజుల తర్వాత మొదటి సారి కేసులు తగ్గాయి. కర్నాటకలో డెయిలీ కేసులు 50 వేలు దాటాయి. అందులో సగం కేసులు బెంగుళూరులోనే నమోదవుతున్నాయి. 

న్యూఢిల్లీ: కరోనా చాలా స్పీడ్​గా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన ఐదునెలల్లోనే  కోటి మంది వైరస్​ బారిన పడ్డారు. గత ఏడాది ఫిబ్రవరిలో కరోనా స్టార్ట్​ కాగా.. డిసెంబర్​ 19 నాటికి కోటి మందికి అంటుకుంది. ఈ ఏడాది మే 4 వరకు కేసుల సంఖ్య రెండు కోట్లు దాటిపోయింది. ఏప్రిల్​ చివరి వారం నుంచి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. తాజాగా ఒక్కరోజే 4.12 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 2 కోట్ల 10 లక్షల 77 వేల 410 కేసులు నమోదవగా.. 2,30,168 మంది చనిపోయారు. యాక్టివ్​ కేసులు 16.92 శాతం, రికవరీ రేట్​ 81.99 శాతం, మరణాల రేట్​ 1.09 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా  మొత్తం 35,66,398 యాక్టివ్​ కేసులు ఉండగా.. 1,72,80,844  మంది కోలుకున్నారు. 
మహారాష్ట్రలో మరణ మృదంగం
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. ముంబై సిటీలో కేసులు తగ్గుతున్నప్పటికీ మిగతా చోట్ల వేలల్లో నమోదవుతున్నాయి. దేశంలో 24 గంటల్లో 3,980 మంది చనిపోతే.. అందులో మహారాష్ట్రలోనే 920 మంది మృత్యువాతపడ్డారు.అటు తర్వాత ఉత్తరప్రదేశ్​లో 353, కర్నాటకలో 346, ఢిల్లీలో 311, చత్తీస్​గఢ్​లో 253, హర్యానాలో 181, పంజాబ్​లో 180, తమిళనాడులో 167 మంది చనిపోయారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,30,168 మంది కరోనాకు బలికాగా, ఇందులో 72,662 మరణాలు మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. మొత్తం మృతుల్లో ఢిల్లీలో 18,063, కర్నాటకలో 16,884, తమిళనాడులో 14,779, యూపీలో 14,151, పశ్చిమ బెంగాల్​లో 11,847, పంజాబ్​లో 9,825, చత్తీస్​గఢ్​లో 9,738 మంది ఉన్నారు. కరోనాతో మృతి చెందుతున్నవారిలో ఎక్కువ మంది దీర్ఘకాలిక రోగాల (కోమార్బిడిటిస్​)తో బాధపడుతున్నవారే ఉన్నారని, మృతుల్లో 70 శాతం మంది వారేనని హెల్త్​ మినిస్ట్రీ ప్రకటించింది. గురువారం నమోదైన మరణాల్లో 75.55 శాతం పదిరాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయి. ఇందులో మహారాష్ట్ర, యూపీ, కర్నాటక, ఢిల్లీ, చత్తీస్​గఢ్​, హర్యానా, పంజాబ్​, తమిళనాడు, రాజస్థాన్​, జార్ఖండ్​ ఉన్నాయి. 

72 శాతం కేసులు పది రాష్ట్రాల్లోనే 

దేశంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్​ కేసుల్లో 72.19 శాతం కేసులు పది రాష్ట్రాల నుంచే వచ్చాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, కేరళ, హర్యానా, పశ్చిమ బెంగాల్​, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​, రాజస్థాన్​ ఉన్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 4,12,262 కేసులు నమోదవగా ఇందులో మహారాష్ట్రలో 57,640, కర్నాటకలో 50,112 కేసులు నమోదయ్యాయి. కర్నాటకలో ఒక్కరోజే ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటి సారి. ఇందులో  బెంగళూరులోనే 23 వేల కేసులు ఉన్నాయి. అంటే కర్నాటకలో వస్తున్న కేసుల్లో సగం కేసులు బెంగళూరు సిటీ నుంచే వస్తున్నాయి. కేరళలో గురువారం ఒక్కరోజే 41,953 మందికి పాజిటివ్​ వచ్చింది. 
కేరళ, మధ్యప్రదేశ్​లో లాక్​డౌన్​
కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు లాక్​డౌన్​లు అమలు చేసేందుకే మొగ్గుచూపుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కంప్లీట్​ లాక్​డౌన్​ అమలు చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. కేరళ, మధ్యప్రదేశ్​ రాష్ట్రాలు కూడా లాక్​డౌన్​ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి. కేరళలో శనివారం నుంచి ఈ నెల 16 వరకు లాక్​డౌన్​ విధిస్తున్నట్లు పినరయ్​ సర్కార్​ ప్రకటించింది. అత్యవసర సేవలకు మాత్రమే  మినహాయింపునిచ్చింది. కేరళలో  ప్రస్తుతం 3,90,906 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. పాజిటివ్​ రేట్​ 27.28 శాతంగా ఉంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల్లోనే  కేరళలో ఫస్ట్​టైమ్​ 41,953 కరోనా కేసులు నమోదయ్యాయి. 63 మంది మృత్యువాతపడ్డారు. ఎర్నాకులం జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. తాజా కేసుల్లో 6,506 కేసులు ఈ జిల్లాలోనే చోటుచేసుకున్నాయి. అటు తర్వాత కోజికోడ్​, మలప్పురం, తిరువనంతపురం, త్రిసూర్​, కొట్టాయంలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్​ వల్ల భారీగా కేసులు నమోదవుతుండటంతో తొమ్మిదిరోజుల పాటు లాక్​డౌన్​ అమలు చేయనున్నట్లు కేరళ సర్కార్​ ప్రకటించింది. మధ్యప్రదేశ్​లో శుక్రవారం నుంచి ఈ నెల 15 వరకు లాక్​డౌన్​ విధిస్తూ శివరాజ్​సింగ్​ చౌహాన్​ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 18 శాతం ఉందని, అందుకే లాక్​డౌన్​ అమలు చేస్తున్నట్లు సీఎం చౌహాన్​ ప్రకటించారు. కరోనా చైన్​ను బ్రేక్​ చేయడానికి లాక్​డౌన్​తోపాటు స్వీయ నియంత్రణే మార్గమని ఆయన అన్నారు. ఈ నెల 15 వరకు స్ట్రిక్ట్​గా జనతా కర్ఫ్యూ (లాక్​డౌన్​) అమలవుతుందని స్పష్టం చేశారు. కొత్తగా 24 గంటల్లో  మధ్యప్రదేశ్​లో 12,421 కరోనా పాజిటివ్​కేసులు నమోదవగా, 86 మంది చనిపోయారు. 
ఢిల్లీలో తగ్గుతున్న కేసులు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.  ఏప్రిల్​ 18 నుంచి మొదటి సారి గురువారం పాజిటివ్​ రేట్​ 25 శాతానికి తగ్గింది. నాలుగు రోజుల నుంచి వస్తున్న కేసులను చూస్తే మూడు రోజులు 20 వేల లోపే కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం 19,133, బుధవారం 20,960,  మంగళవారం 19,953, సోమవారం 18,043 కేసులు నమోదయ్యాయని వివరించింది. గత నెల 19 నుంచి ఇక్కడ లాక్​డౌన్​ అమలు చేస్తుండటంతో  కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల 9తో లాక్​డౌన్​ గడువు ముగియనుంది. అయితే మరిన్ని రోజులు లాక్​డౌన్​ను పొడిగించే ఆలోచనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 
16.25 కోట్ల మందికి వ్యాక్సిన్​
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 16.25 కోట్ల మంది వ్యాక్సిన్​ తీసుకున్నారని హెల్త్​ మినిస్ట్రీ ప్రకటించింది. 18 నుంచి 44 ఏజ్​ గ్రూప్​ వాళ్లకు కూడా 12 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్​ జరుగుతోందని, ఈ ఏజ్​ గ్రూప్​ వాళ్లలో ఇప్పటివరకు 9,04,263 మంది టీకా వేసుకున్నట్లు వివరించింది.   
నార్త్​లో యూకే వేరియంట్​ దడ
ఉత్తర భారతదేశంలో యూకే వేరియంట్​(బీ 1.1.7) వల్ల భారీగా కేసులు నమోదవుతున్నాయని, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్​తో డబుల్​ మ్యుటేంట్​వేరియంట్​ (బీ.1.617) వల్ల కేసులు పెరిగిపోతున్నాయని ఎన్​సీడీసీ డైరెక్టర్​ సుజీత్​ సింగ్​ చెప్పారు. గత నెలన్నర రోజులుగా యూకే వేరియంట్​ వ్యాప్తి ఎక్కువగా ఉందని,  పంజాబ్​లో 482, ఢిల్లీలో 516 శాంపిల్స్​లో యూకే వేరియంట్​ను గుర్తించినట్లు తెలిపారు. మహారాష్ట్రలో కొత్తగా బ్రెజిల్​ ​ వేరియంట్​ (పీ1) గుర్తించినట్లు చెప్పారు. 
తెలంగాణలో సౌత్​ ఆఫ్రికన్​ వేరియంట్​
తెలంగాణలో యూకే వేరియంట్​తో పాటు సౌత్​ ఆఫ్రికన్​ వేరియంట్​(బి.1.315)ను కూడా గుర్తించినట్లు ఎన్​సీడీసీ డైరెక్టర్​ సుజీత్​ సింగ్​ పేర్కొన్నారు.  ఢిల్లీలోనూ సౌత్​ ఆఫ్రికన్​ వేరియంట్​ను కొనుక్కొన్నట్లు వివరించారు.