
మనుషులకు రోగాలు ఉన్నట్టే తెలంగాణలో భూములకు సమస్యలు ఉన్నాయి. రైతు భూములకు ఉన్న ప్రధాన సమస్యలలో ముఖ్యమైనది తన భూమిలోకి వెళ్లడానికి దారి ( అచ్చ తెలంగాణ భాషలో తొవ్వ ) లేకపోవడం ఒకటి. ఇండియా, పాకిస్తాన్ వాఘా బార్డర్ క్రాస్ చేయడానికి ఓ పద్ధతి, పరిష్కారం ఉంది. కానీ, తెలంగాణలో రైతులు ఒకరి పొలం నుంచి ఇంకొకరి పొలంలోకి వెళ్లాలంటే పెద్ద యుద్ధమే చేయాలి.
తెలంగాణలో నిజాం కాలంలో జరిగిన సర్వే మ్యాపులే ( విలేజ్ మ్యాప్) ఇప్పటికీ ఆధారం. ఈ సర్వేలో గ్రామంలో ప్రజలు నివసిస్తున్న భూభాగాన్ని గ్రామకంఠం పేరుతో మిగతా వ్యవసాయ భూములు, చెరువులు, కుంటలకు సర్వే నంబర్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా వాగులు, ప్రజల అవసరాల కోసం ఉపయోగించే నక్ష బాటలు చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది.
భూ చట్టాల న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి ముప్పై ఏళ్లకోసారి సమగ్ర భూ సర్వే జరగాలి. కానీ, నిజాం కాలంలో జరిగిన సర్వే కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జరగలేదు. పదివేల పైచిలుకు రెవెన్యూ గ్రామాలలో ఇప్పటికీ 413 గ్రామాలలో సర్వే రికార్డులు అందుబాటులో లేవు. ప్రస్తుత ప్రభుత్వం సర్వే కోసం వీటిని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టింది.
జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టు కాలువల కోసం భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం రైతులకు కొంత నష్టపరిహారం చెల్లించి, భూములు సేకరించి కాలువలు తవ్వింది. అందులో మైనర్, మేజర్ కాలువలు ఉన్నాయి. వాటి చుట్టూ రెండువైపులా కనీసం ముప్ఫై ఫీట్ల దారి ఏర్పడింది. కాలువల వల్ల రైతులకు కొంత ఉపశమనం దొరికినా..
సేకరించిన భూమి రెవెన్యూ రికార్డులలో ఇరిగేషన్ కెనాల్గా కూడా అప్డేట్ కాలేదు. సమగ్ర భూ సర్వే ద్వారా విలేజ్ మ్యాపులు అప్డేట్ కాకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు.
పరస్పర అంగీకారం
రైతుల పరస్పర అంగీకారంతో ముందు పొజిషన్లో ఉన్న రైతుకు, వెనకాల ఉన్న రైతు గుంటకు రెండు గుంటలు లేదా భూమి రీప్లేస్ రిజిస్ట్రేషన్ చేస్తేనే దారులు తెరుస్తున్నారు. ఈక్రమంలో వివాదాలు కూడా నెలకొంటున్నాయి. తరతరాలుగా ఒకరి భూమి నుంచి ఇంకొకరి భూమిలోకి వెళ్లాలంటే లైన్ ఆఫ్ కంట్రోల్.. ఇండియా, పాకిస్తాన్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్.. చైనాతో యుద్ధం చేసేంత పరిస్థితులు రైతుల మధ్య తరతరాలుగా నడుస్తున్నాయి.
నక్ష బాటలు కబ్జా చేసినా, పరస్పర అంగీకారంతో నడిచిన దారులు మూసేసినా రైతులు ఈజ్మెంట్ ఆఫ్ రైట్స్ ద్వారా కోర్టులను ఆశ్రయించి పరిష్కారం చేసుకోవచ్చు. కానీ, రెక్కాడితేకానీ డొక్కాడని రైతులు, గుంటలలో భూమి విస్తీర్ణం ఉన్న రైతులు కోర్టులను ఆశ్రయించి న్యాయంకోసం ఏళ్లపాటు వేచిచూసే పరిస్థితిలో లేరు.
దారి చూపని ధరణి
గెట్టు పంచాయితీ లేని తెలంగాణ చేస్తా అని గత ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసి కొత్త రెవెన్యూ చట్టం 2020, ధరణి పోర్టల్ తెచ్చారు. కానీ, ఎక్కడా ఒక్క ఎకరం భూమి కొలిచింది లేదు. గెట్టు పంచాయితీ తేల్చింది లేదు. దారి చూపింది లేదు. రైతులు తమ వ్యవసాయ భూమి కొలవాలంటే మీసేవలో ఎఫ్ లైన్ పిటిషన్ ద్వారా అప్లికేషన్ చేసుకొని కట్న కానుకలు సమర్పించిన తర్వాతే, మండల సర్వేయర్ వచ్చి సర్వే చేసి.. సర్వే నంబరులో ఉన్న మొత్తం విస్తీర్ణం, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం హద్దులతో పంచనామా ఇవ్వడం జరుగుతుంది. అంతేతప్ప ఒక సర్వే నంబర్లో ఉన్న రైతుల వాస్తవ విస్తీర్ణంతో రికార్డుల ప్రకారం ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా సర్వే నంబరులో ఉన్న రైతులకు పరిష్కారం చూపడం లేదు.
భూభారతిలో ఎంజాయ్మెంట్ సర్వే పరిష్కార మార్గదర్శకాలు ప్రభుత్వం రూపొందించాలి. ధరణి పోర్టల్లో ఉన్న కడస్ట్రియల్ మ్యాప్ (ఆన్లైన్ మ్యాప్) భూ భారతి పోర్టల్లో కనిపించడం లేదు. నిజాం సర్వే మ్యాపుల ద్వారా రైతులు తమ భూమి హద్దులు చూసుకునే అవకాశం ఉండేది. కానీ, ప్రస్తుతం పోర్టల్ పునరుద్ధరణలో భాగంగా కనిపించడం లేదు. ఆన్లైన్ మ్యాపులను త్వరగా అందుబాటులోకి తెచ్చినట్టు అయితే రైతులకు ఎంతోకొంత ఉపయోగపడుతుంది.
భూభారతి పరిష్కారం చూపాలి
మేం అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలుపుతామని ప్రకటన చేసి కొత్త ఆర్వోఆర్ చట్టం 2024 భూభారతి పోర్టల్ను రూపొందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ గ్రామ పాలన అధికారి, లైసెన్స్ సర్వేయర్ల నియామకం, గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ముందుకు వెళుతోంది. కానీ, రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూ సర్వే పట్టాలు ఎక్కలేదు. కేవలం 413 గ్రామాలలో మాత్రమే పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూ సర్వే చేపట్టి గెట్టు పంచాయితీ లేకుండా భూభారతి ద్వారా బాట పరిష్కారం చూపాలి. ఒక సర్వే నంబర్ నుంచి ఇంకో సర్వే నంబర్లోకి రైతులు వెళ్లడానికి కనీస అవసరాలకు అనుగుణంగా తోవ కోసం.. ఆయా జిల్లాల్లో భూమి విలువను బట్టి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా విధిగా బాటలు తెరవాలి. ఈ మేరకు చట్టంలో వెసులుబాటు తెచ్చినట్టయితే తెలంగాణలో రైతులకు (దారులు, బాటలు, తొవ్వలు) విషయంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
- బందెల సురేందర్ రెడ్డి, మాజీ సైనికుడు–