కూతురిపై మళ్లీ కోర్టుకెక్కిన ముత్తిరెడ్డి

కూతురిపై మళ్లీ కోర్టుకెక్కిన ముత్తిరెడ్డి
  • హైదరాబాద్​ సిటీ సివిల్​ కోర్టులో పిటిషన్ 
  • తుల్జా భవానీ రెడ్డికి కోర్టు నోటీసులు  
  • ఎమ్మెల్యే ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశాలు

జనగామ, వెలుగు : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కూతురు తుల్జా భవానీ రెడ్డి మధ్య పోరు రగులుతూనే ఉంది. కూతురు తీరు పై ఇప్పటికే హై కోర్టులో రిట్​పిటిషన్​ దాఖలు చేసిన ముత్తిరెడ్డి ఇటీవల హైదరాబాద్​ సిటీ సివిల్​ కోర్టులో మరో పిటిషన్​ వేశారు. దీంతో తుల్జా భవానీ రెడ్డికి కోర్టు నోటీసులు జారీ చేసింది. తుల్జా భవానీ రెడ్డి తన విధులకు ఆటంకం కలిగిస్తోందని, తీవ్ర ఆరోపణలు చేస్తూ పరువుకు భంగం కలిగిస్తోందని ముత్తిరెడ్డి గత జూన్​27న హైకోర్టులో రిట్​పిటిషన్​ వేశారు. దీంతో అప్పట్లో కోర్టు ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు తుల్జా భవానీ రెడ్డితో పాటు, ఆమె భర్త రాహుల్​ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గత నెల 19న తుల్జా భవానీ దంపతులు జనగామ పోలీస్​ స్టేషన్​లో విచారణకు హాజరయ్యారు. అదే రోజు మరో మారు తండ్రి ప్రవర్తనపై మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. ఆ తర్వాత కూడా  హైదరాబాద్​లోని పలు టీవీ ఛానళ్లతో పాటు, యూట్యూబ్​ఇంటర్వ్యూల్లో తండ్రి ముత్తిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డి కొన్ని రోజుల క్రితం హైదరాబాద్​ సిటీ సివిల్​కోర్టును ఆశ్రయించారు. 

శాసనసభ్యుడిగా ఉన్న తన పరువుకు భంగం కలిగించేలా తుల్జా భవానీ రెడ్డి ప్రసార మాధ్యమాల్లో మాట్లాడుతోందని అందులో పేర్కొన్నారు. సాక్ష్యాలుగా పలు ఛానళ్లు, యూట్యూబ్​ వీడియోలను జత చేశారు. తనకు వ్యతిరేకంగా ప్రింట్, ఎలక్ర్టానిక్​తో పాటు, సోషల్​మీడియాలో, మరే ఇతర ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్​ను విచారించిన సిటీ సివిల్​ కోర్టు ఈనెల 9న తుల్జా భవానీ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగేలా ఎటువంటి కామెంట్స్​ చేయరాదని పేర్కొంది. ఈ ఆదేశాలు ఈనెల 30 వరకు అమలులో ఉంటాయని చెప్పింది. ఈ నోటీసులు తుల్జా భవానీ రెడ్డికి ఈనెల 10న అందినట్లు ఆమె అనుచరుడు శివరామకృష్ణ ‘వెలుగు’కు తెలిపారు.