ప్రేక్షకులు లేకుండానే ఇండియా-ఇంగ్లండ్ పోరు
బీసీసీఐ, టీఎన్సీఏ నిర్ణయం
చెన్నై: ఔట్ డోర్ స్పోర్టింగ్ ఈవెంట్స్ కు 50 శాతం క్రౌడ్ను స్టేడియాల్లోకి అనుమతించుకోవచ్చని సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించినప్పటికీ.. బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్ సీఏ) ధైర్యం చేయడం లేదు. కరోనా ముప్పు ఇంకా తొలగకపోవడంతో ఇండియా, ఇంగ్లండ్ మధ్య చెన్నై వేదికగా జరిగే తొలి రెండు టెస్ట్లను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించాలని డిసైడ్ అయ్యాయి. ఈ మేరకు టీఎన్ సీఏ సెక్రటరీ నుంచి అసోసియేషన్ సభ్యులకు లేఖలు అందాయి. ‘బీసీసీఐ సూచనల మేరకు తొలి రెండు టెస్ట్లకు ఫ్యాన్స్ తోపాటు, గెస్ట్లు, కమిటీ మెంబర్లను కూడా స్టేడియంలోకి అనుమతించడం లేదు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎంఏ చిదంబరం స్టేడియంలో ఫిబ్రవరి 5–9 తేదీల్లో ఫస్ట్ టెస్ట్, 13–17 మధ్య రెండో టెస్ట్ జరగనుంది. కాగా, సిరీస్లో మిగిలిన రెండు టెస్ట్లకు ఆతిథ్యమివ్వనున్న మొతెరా స్టేడియం నిర్వాహకులు మాత్రం ఫ్యాన్స్ ను అనుమతించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అంటున్నారు.