నాగర్ కర్నూల్, వెలుగు: ఏండ్ల తరబడి తాము సాగుచేసుకుంటున్న భూముల్లో పంట వేయొద్దని అటవీ అధికారులు అడ్డుకోవడంతో ఓ గిరిజన మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. భూమి లేకుంటే తామెట్లా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారుల ముందే పురుగుల మందు తాగి పడిపోయింది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామ సమీపంలో మ్యాదర్ బండ దగ్గర ముడావత్ తారాసింగ్, ముడావత్ చంద్రు, గుజ్జ నర్సింహ కుటుంబాలు 30 ఏండ్లుగా 18 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్నాయి. ఇటీవల వర్షాలు కురవడంతో బుధవారం వ్యవసాయ పనులు ప్రారంభించారు. 3 కుటుంబాలకు చెందినవారు దుక్కి దున్ని విత్తనాలు వేస్తుండగా.. చింతపల్లి సెక్షన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు సత్యం, మహేశ్, వెంకటయ్య అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారని, వ్యవసాయం లేకుంటే ఎట్లా బతకాలని గంట పాటు ఆ గిరిజన కుటుంబాలు అధికారుల కాళ్లావేళ్లా పడ్డాయి. అయినా ఆఫీసర్లు వినలేదు. దీంతో ముడావత్ చంద్రు భార్య దేవి ఫారెస్ట్ అధికారుల ముందే పురుగుల మందు తాగి పొలంలో పడిపోయింది. వెంటనే ఆమెను బైక్పై కొల్లాపూర్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.
రెండేండ్లుగా ఇబ్బందులు పెడ్తున్నరు
చింతపల్లి ఫారెస్ట్ సెక్షన్ పరిధిలో ముక్కిడిగుండం, మొలచింతలపల్లి, నార్లాపూర్, నడివాగు తండా, గుండ్యానాయక్ తండా, గేమ్యానాయక్ తండాల పరిధిలో దాదాపు 3 వేల ఎకరాల పోడు భూములు ఉన్నాయి. ముక్కిడిగుండం సమీపంలోని మ్యాదర్ బండ వద్ద తారాసింగ్, చంద్రు, గుజ్జ నర్సింహ తదితరులు తలా 6 ఎకరాల్లో 30 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. రెండేండ్లుగా ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడ్తున్నారని తారాసింగ్, చంద్రు వాపోయారు. వానాకాలంలో ఒక పంట మాత్రమే సాగు చేసుకునే తమను విత్తనాలు వేయనివ్వట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు.