హైదరాబాద్, వెలుగు:పాత టెన్త్ మార్కుల మెమో పోయిందా.. జిరాక్స్కూడా దొరకట్లేదా.. డూప్లికేట్మెమో కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా.. ఇక ముందు ఈ సమస్యలు తప్పనున్నాయి. రోజుల తరబడి పరీక్షల విభాగం, డీఈవో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. సులువుగా టెన్త్ రికార్డులను పొందే అవకాశం వస్తోంది. ఇటీవలివే కాదు 1958 సంవత్సరం నుంచీ కూడా టెన్త్ మెమోలు, ఇతర రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని సర్కారు నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఏజెన్సీలను ఎంపిక చేసి.. ఫిబ్రవరి నుంచి పూర్తి స్థాయిలో పని మొదలుపెట్టనుంది. లక్షలాది మంది వివరాలను అప్లోడ్ చేయాల్సి ఉండటంతో ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చేందుకు రెండు, మూడేండ్లు పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
రాష్ట్రంలో ఏటా టెన్త్ పరీక్షలకు సుమారు ఐదున్నర లక్షల మంది స్టూడెంట్స్ హాజరవుతున్నారు. విద్యా శాఖ టెన్త్ రిజల్ట్స్విడుదల చేయగానే షార్ట్ మెమోలను తాత్కాలికంగా వెబ్సైట్లో పెడుతోంది. పూర్తిస్థాయి మెమోలను ఏటా ఆగస్టు, సెప్టెంబర్నెలల్లో స్కూళ్లకు పంపుతోంది. అయితే 2014 మార్చి రిజల్ట్స్ నుంచి టెన్త్ మెమోలన్నీ ఆన్లైన్లో పెడుతున్నారు. 2004 నుంచీ చదివిన వారి వివరాలు కూడా ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చారు. కానీ అంతకంటే ముందు టెన్త్ చదివిన వారి మెమోలు కావాలంటే తిప్పలు తప్పడం లేదు. కొత్త మెమో, డూప్లికేట్ మెమో కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఆ వివరాలను సేకరించేందుకు అధికారులకు రోజుల తరబడి సమయం పడుతుంది. పాత వివరాలన్నీ సక్రమంగా లేకపోవడం, డిజిటలైజ్కాకపోవడమే కారణం. దాంతోపాటు పాత రిజిస్టర్లు, ఫైళ్లు పాడైపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ట్యాబులేషన్ రిజిస్టర్లు, రికార్డులన్నీ డిజిటలైజేషన్చేయాలని నిర్ణయించారు.
60 ఏండ్ల కింది నుంచి..
1958వ సంవత్సరం నాటి నుంచీ ఉన్న అన్ని రిజిస్టర్లను డిజిటలైజేషన్ చేయనున్నారు. కీ రిజిస్టర్లన్నింటినీ స్కానింగ్ చేసి ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఏ ఏడాదికా ఏడాది వారీగా, జిల్లాల వారీగా వివరాలను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. అందులో మెమోలతోపాటు స్టూడెంట్లకు సంబంధించిన ఇతర వివరాలు ఉంటాయి. హాల్ టికెట్ నంబర్ఎంటర్ చేస్తే క్షణాల్లో వివరాలన్నీ కనిపిస్తాయి. డూప్లికేట్ మెమోలు, ఇతర వివరాలు పొందాలనుకునే వారికి రోజుల తరబడి వేచి చూసే ఇబ్బంది తప్పనుంది.
