- మేడిగడ్డ మరమ్మతులకు భారీగా ఖర్చవుతుందని ప్రభుత్వం ఆందోళన
- ఆ బ్లాక్ను పునాదుల నుంచీ తొలగించి కొత్తగా నిర్మించాలంటున్న ఎక్స్పర్ట్స్
- వాటర్ డైవర్షన్కు కాఫర్ డ్యామ్ అవసరం.. సీకెంట్ పైల్స్ను తొలగించలేని పరిస్థితి
- వాటి ప్లేసులో షీట్ పైల్స్ వాడితే ఎలా ఉంటుందన్న యోచన
- ఎటూ తేల్చుకోలేక ఇరిగేషన్ అధికారుల్లో అయోమయం
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులకు భారీగా ఖర్చవుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. కుంగిపోయిన ఏడో బ్లాక్ రిపేర్లకే రూ.1,700 కోట్ల దాకా ఖర్చవుతుందన్న అంచనాలతో తలపట్టుకుంటున్నది. కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్2023 అక్టోబర్21న ఐదున్నర మీటర్ల మేర కుంగింది. నేషనల్డ్యామ్సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణులు వచ్చి పరిశీలించి, రిపేర్లు చేయడానికి కొన్ని గైడ్లైన్స్ నిర్దేశించారు. అందులో భాగంగానే ప్రభుత్వం పుణెకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్స్టేషన్(సీడబ్ల్యూపీఆర్ఎస్)తో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద టెస్టులు చేయిస్తున్నది.
అయితే మేడిగడ్డ వద్ద పరిస్థితులను చూసిన నిపుణులు.. ఏడో బ్లాక్ను పునాదుల నుంచి పైదాకా 11 గేట్లతో సహా పూర్తిగా తొలగించాల్సిందేనని చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో దానికయ్యే ఖర్చు భారంగా మారింది. ఆ బ్లాక్మొత్తాన్ని పూర్తిగా పునాదుల నుంచి కట్టాలంటే రూ.1,500 కోట్ల నుంచి రూ.1,700 కోట్ల దాకా ఖర్చవుతుందన్న అంచనాలతో ప్రభుత్వం తలపట్టుకుంటున్నది.
కూల్చుడు.. కట్టుడు.. రెండూ కష్టమే!
ఏడో బ్లాక్ను పూర్తిగా తొలగించి నిర్మించాలంటే నీటి డైవర్షన్కు మరో కాఫర్డ్యామ్ను ఎగువన కట్టాల్సి ఉంటుంది. ఆ కాఫర్డ్యామ్నిర్మాణానికయ్యే ఖర్చుతో పాటు అక్కడ వేయాల్సిన అప్రోచ్రోడ్లు, ఇతర సామగ్రికి అదనంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇటు ఏడో బ్లాక్ పొడవు 200 మీటర్లకుపైగా ఉంది. బ్యారేజీ ఎత్తుకు తగ్గట్టుగా నిర్మించాలంటే దానికయ్యే ఆర్సీసీ, స్టీల్, కాంట్రాక్ట్ ఖర్చులన్నీ కలిసి తడిసి మోపెడవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. సీసీ బ్లాకులు, రాఫ్ట్లు, గేట్లు, అన్నీ తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. బ్లాక్ను కూల్చేయాలన్నా పెద్ద శ్రమతో కూడుకున్న పని అన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. కూల్చేస్తే వాటికున్న మెకానికల్కాంపొనెంట్లను మళ్లీ తిరిగి వాడుకోలేరని చెబుతున్నారు. అవన్నీ కొత్తగా మళ్లీ సమకూర్చుకోవాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కూల్చేద్దామనుకున్నా.. దానికి ఆనుకుని ఉన్న బ్లాకులకు ఏమైనా ప్రమాదం జరిగితే ఏంటన్న ఆందోళన కూడా ఇరిగేషన్శాఖను, ప్రభుత్వాన్ని కలవరపరుస్తున్నది.
సీకెంట్పైల్స్పరిస్థితి ఏంటి?
ఏడో బ్లాక్ను పునాదుల నుంచి మళ్లీ నిర్మించాల్సి ఉండడంతో బ్యారేజీలో వాడిన అత్యంత కీలకమైన కాంపొనెంట్ సీకెంట్పైల్స్ పరిస్థితేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బ్యారేజీకి అసలు పునాది అదే కావడం, అది లేనిదే బ్యారేజీ నిలబడలేని పరిస్థితి ఉండడంతో.. ఆ సీకెంట్పైల్స్ను ఏం చేయాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారని తెలుస్తున్నది. ఏడో బ్లాక్ ఒక్క దానికే సీకెంట్పైల్స్ను తీసేయడం కష్టమన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. సీకెంట్పైల్స్ను తీసేయాల్సి వస్తే బ్యారేజీ మొత్తానికే తీసేయాల్సి ఉంటుందని, అది సాధ్యంకాని పని అని ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం. ఇప్పుడున్న సీకెంట్పైల్స్ను అలాగే ఉంచి.. జెడ్ షీట్పైల్స్ను వాడితే ఎలా ఉంటుందన్న ఆలోచననూ చేస్తున్నారన్న చర్చ జరుగుతున్నది. మేడిగడ్డకు సంబంధించి ఈ అంశాలన్నింటి మీద ఇరిగేషన్శాఖ అయోమయానికి గురవుతున్నట్టు సమాచారం. అయితే, మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పునరుద్ధరణ డిజైన్ల కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ఫర్ ప్రపోజల్ను పంపించింది. ఈ నెల 12నే నిర్మాణ సంస్థలకు డిజైన్ల బాధ్యతను అప్పగించాల్సి ఉన్నా.. సంస్థల విజ్ఞప్తితో గడువును 19 వరకు పొడిగించారు. అది కొనసాగుతుండగానే మేడిగడ్డ బ్యారేజీ వద్ద సీడబ్ల్యూపీఆర్ఎస్నిపుణులు టెస్టులు చేస్తున్నారు.
