
ఇంటర్, డిగ్రీ స్టూడెంట్లకు మిడ్ డే మీల్స్ పెడ్తామని చెప్పి రెండేండ్లు పూర్తి
ప్రకటనకే పరిమితమైన సీఎం కేసీఆర్ హామీ
రెండేండ్లుగా స్టూడెంట్ల ఎదురుచూపులు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని సర్కారు కాలేజీల్లో చదివే స్టూడెంట్లకు మిడ్డే మీల్స్ పెట్టే అంశాన్ని ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయింది. సీఎం కేసీఆర్ ఈ స్కీమ్ ప్రకటించి రెండేండ్లు పూర్తయినా, ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఈ ఏడాదైనా అమలు చేస్తారో లేదో అనే అనుమానం స్టూడెంట్లు, లెక్చరర్లలో నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 406 సర్కారు జూనియర్ కాలేజీలు, 132 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 3 లక్షల మందికి పైగా స్టూడెంట్లు చదువుతున్నారు. జూన్లో డిగ్రీ సెకండియర్, థర్డ్ ఇయర్ క్లాసులతో పాటు ఇంటర్ సెకండియర్ క్లాసులు మొదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్ క్లాసులు గత వారం ప్రారంభమయ్యాయి. మరోపక్క డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ(దోస్త్) ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది. ఆయా కాలేజీల్లో చదివే విద్యార్థులకు 2020–21 విద్యా సంవత్సరం నుంచే మిడ్డే మీల్స్ కింద మధ్యాహ్నా భోజనం పెడ్తామని అప్పట్లో టీఆర్ఎస్ సర్కార్ప్రకటించింది. సర్కారు కాలేజీల్లో డ్రాపౌట్స్ తగ్గించడంతో పాటు స్టూడెంట్లకు పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో అన్ని డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో ఈ పథకం అమలు చేయాలనుకుంటున్నట్లు 2020 జులై17న సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే, అప్పట్లో కరోనా ప్రభావంతో ఈ పథకం అమలు కాలేదు. ఆ తర్వాతి ఏడాదైనా అమలు చేస్తారని భావించినా దాని ఊసు ఎత్తలేదు. ఈ ఏడాది కూడా కాలేజీల్లో మిడ్డే మీల్స్ పెట్టాలనే ఆలోచన సర్కారుకు లేదని, అసలు ఈ విషయాన్నే పూర్తిగా మర్చిపోయిందని అధికారులు అంటున్నారు.
అడ్మిషన్లు పెరిగినా అమలు కాలే..
మిడ్డే మీల్స్ ప్రకటనతో సర్కారు ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగాయి. ఈ ఏడాది తప్పకుండా మధ్యాహ్న భోజనం పెడతారని లెక్చరర్లు స్టూడెంట్లకు చెప్పి, కాలేజీల్లో చేర్చుకుంటున్నారు. అయితే, 2018లో కాలేజీల్లో మిడ్డే మీల్స్ పెట్టే అంశంపై ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేసింది. అదే ఏడాది ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఈడీ, డీఈడీ, మోడల్ జూనియర్ కాలేజీల్లో చదివే స్టూడెంట్లకు మిడ్డే మీల్స్ పెడ్తామని అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటన కూడా చేశారు. కానీ అమలు కాలేదు. ఈ ఏడాదైనా ప్రభుత్వం అన్ని కాలేజీల్లో మిడ్ మీల్స్ను ప్రారంభించాలని స్టూడెంట్లు, లెక్చరర్ల యూనియన్లు
కోరుతున్నాయి.
మిడ్ డే మీల్స్ ప్రారంభించాలె
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కాలేజీల్లో మిడ్డే మీల్స్ స్కీమ్ ప్రారంభించాలి. నాలుగేండ్ల కిందనే ప్రారంభిస్తామని పేద విద్యార్థులకు ఆశ చూపి, ఇప్పటికీ ప్రభుత్వం స్టార్ట్ చేయకపోవడం సరికాదు. ఈ స్కీమ్ అమలు చేస్తే ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పెరుగుతాయి. ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలి. లేకపోతే ఆందోళనలు చేస్తాం.
- నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి