- ధూప దీప నైవేద్యంపై సోషల్ ఆడిట్
- గుళ్లలో నిత్యపూజల నిర్వహణపై ప్రభుత్వం ఫోకస్
ఆసిఫాబాద్, వెలుగు: దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ధూప దీప నైవేద్యం పథకంపై ప్రభుత్వం సోషల్ ఆడిట్ చేపట్టింది. చిన్న దేవాలయాల్లో నిత్యపూజలు సక్రమంగా జరుగుతున్నాయా? నిధులు సరిగా వినియోగిస్తున్నారా? నమోదైన పూజారులే సేవలు నిర్వహిస్తున్నారా? అనే అంశాలపై గ్రామస్థాయిలో పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న ఆలయాల్లో నిత్య పూజలు కొనసాగించేందుకు పూజారులకు ప్రతి నెలా రూ.10 వేల చొప్పున వేతనం అందిస్తోంది.
కానీ, కొన్ని ఆలయాల్లో నిత్య పూజలు జరగడం లేదని, ఒకరికి బదులు మరొకరు పూజలు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సోషల్ ఆడిట్కు ఆదేశాలు జారీ చేసింది. ఇందులోభాగంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో 57 ఆలయాల్లో సోషల్ ఆడిట్ కొనసాగుతోంది. ఆలయం, నిత్యపూజల నిర్వహణ, ఆభరణాలు, ఆలయ ఆస్తులు, భూములు, ఆదాయ వనరులు, పూజారుల వివరాలను అధికారులు నమోదు
చేస్తున్నారు.
