
- గెహ్లాట్, పైలట్ మధ్య సయోధ్యకు రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్
- రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభంపై అధిష్టానం నష్టనివారణ చర్యలు
- గెహ్లాట్, పైలట్ మధ్య విబేధాలపై 13న చర్చలు
రాజస్థాన్ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు హైకమాండ్ రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదుర్చేందుకు అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
రాజస్థాన్ లో ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. కొన్ని నెలలుగా సీఎం గెహ్లాట్, పైలట్ మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. గతంలో చాలా సందర్భాల్లో పరస్పరం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు.
సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ నిర్వహించిన నిరాహార దీక్షపై అధిష్టానం సీరియస్ గా ఉంది. గెహ్లాట్, పైలట్ విబేధాల అంశం రానున్న అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశం ఉందని పార్టీ హైకమాండ్ గ్రహించింది. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలు చేపట్టింది.
అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ గురువారం (ఏప్రిల్ 13న) సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సమావేశానికి సచిన్ పైలట్ని కూడా పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సుఖ్జిందర్ రంధావా ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఇప్పటికే సమావేశమయ్యారు. రాజస్థాన్ లోని ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితిని వివరించారు. రాంధావా నుంచి నివేదిక తీసుకున్న తర్వాత ఖర్గే రాహుల్తో కూడా చర్చించారు. రాహుల్ దీనిపై సోనియాతో చర్చించనున్నారు. ఖర్గేదే తుది నిర్ణయం అని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
గత బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలంటూ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సచిన్ పైలట్ చేసిన నిరాహార దీక్షపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉంది. పైలట్ దీక్ష పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించింది. సొంత ప్రభుత్వానికి (కాంగ్రెస్) వ్యతిరేకంగా సచిన్ పైలట్ మంగళవారం (ఏప్రిల్ 11న) ధర్నా చేపట్టారు. రాజస్థాన్లో వసుంధర రాజే నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.
పైలట్ నిరాహార దీక్షపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించబడుతుందని హెచ్చరించింది. ఈ సమస్యను పైలట్ తమతో చర్చించలేదని కాంగ్రెస్ పేర్కొంది.