- ఇప్పుడు వడ్డీతో కలిపి కట్టండి
- మెక్టెక్ కంపెనీ కేసులో ఐటీ ఆఫీసర్లకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని మెక్టెక్ కంపెనీకి చెందిన రూ. 5 కోట్ల క్యాష్ను సీజ్ చేసిన ఇన్కం ట్యాక్స్ ఆఫీసర్లు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది. రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ కు ముందస్తుగానే డబ్బును ఆపడం ఐటీ యాక్ట్–1961 ప్రకారం నేరం అవుతుందని హెచ్చరించింది. రూ.5 కోట్లు సీజ్ చేసినప్పటి నుంచి12% వడ్డీతో పిటిషనర్కు చెల్లించాలని, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు ఇవ్వాలని జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, జస్టిస్ ఇ.అమర్నాథ్గౌడ్లతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులిచ్చింది. గుజరాత్కు చెందిన మెక్టెక్ సంస్థ ఉద్యోగి విపుల్ కుమార్ పటేల్ రూ.5 కోట్ల క్యాష్తో 2019 ఆగస్టు 28న హైదరాబాద్ లో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దానిని హవాలా సొమ్ముగా భావించి ఐటీ శాఖకు అప్పగించారు. పాటిల్ తమ ఉద్యోగేనని, ఆ సొమ్ము తమ కంపెనీదేనని చెప్పినా ఐటీ శాఖ తిరిగి ఇవ్వకపోవడంతో ఆ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. తాము 2015–16 నుంచి మూడేళ్లల్లో రూ.173 కోట్లకుపైగా టర్నోవర్ చేశామని, పట్టుబడిన రూ.5 కోట్లు తమవేనని చెప్పింది. ఈ వాదనను ఐటీ శాఖ వ్యతిరేకించింది. తాను పి.ఉమేష్చంద్ర సన్స్ సంస్థ ఉద్యోగినని డబ్బుతో పట్టుబడినప్పుడు పటేల్ చెప్పాడని, ఆ క్యాష్తమదేనని చెప్పేందుకు ఉమేష్చంద్ర సన్స్ ముందుకు రాలేదని తెలిపింది.