
- ఆ 50 ఎకరాలు హెచ్ఎండీఏవే
- శంషాబాద్ భూములపై హైకోర్టు తీర్పు
- ఫేక్గా తేలిన డాక్యుమెంట్లు, కింది కోర్టుల ఉత్తర్వులు
- 2007లోనే తెలంగాణ రాష్ట్రం ఉన్నట్లుగా పత్రాల సృష్టి
- బోగస్గా తేలడంతో హెచ్ఎండీఏకు అనుకూలంగా తీర్పు
హైదరాబాద్, వెలుగు : శంషాబాద్లోని వివాదాస్పద 50 ఎకరాల భూమి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)దేనని హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఫేక్ డాక్యుమెంట్లను, నకిలీ కోర్టు తీర్పు ప్రతులతో భూమిని కాజేయాలని ప్రయత్నించిన వారి ఆటలు సాగలేదు. 181 ఎకరాల్లోని 50 ఎకరాలపై తమకు హక్కులు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ల డివిజన్ బెంచ్ గురువారం తీర్పు చెప్పింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామంలోని సర్వే నంబర్ 725/21లోని 7.31 ఎకరాలు, సర్వే నంబర్ 725/23లోని 10.07 ఎకరాలు, సర్వే నంబర్ 725/25లోని 12.34 ఎకరాలు సహా దాదాపు 50 ఎకరాల భూమిని తన పూర్వీకులు ‘‘పైగా(సైన్యం నిర్వహణకు పరిహారంగా నిజాం నవాబ్ మంజూరు చేసిన భూమి)’’ వాటి యజమానుల నుంచి కొనుగోలు చేశారంటూ హైదరాబాద్ వట్టేపల్లికి చెందిన యహియా ఖురేషి మరొకరు వేర్వేరుగా వేసిన రెండు పిటిషన్లను కొట్టివేసింది. తమకు అనుకూలంగా అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ హెచ్ఎండీఏ ఆఫీసర్లు, పోలీసులు జోక్యం చేసుకుని భూమి విషయంలో అడ్డంకులు, అవరోధాలు కలిగిస్తున్నారంటూ పిటిషనర్ల వాదనను తిరస్కరించింది.
బోగస్ డాక్యుమెంట్లు, రషీదులు, తప్పుడు కోర్టు ఆర్డర్లతో 50 ఎకరాల భూమిని కాజేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని ఏజీ బీఎస్ ప్రసాద్ చేసిన వాదనను హైకోర్టు ఆమోదించింది. 2007 నుంచి శంషాబాద్ గ్రామ పంచాయతీ జారీ చేసిన ప్రాపర్టీ ట్యాక్స్ నోటీసులు, మున్సిపల్ పర్మిషన్లు రెవెన్యూ రికార్డులు, కరెంటు బిల్లులు, ఫొటోలు, 2023, ఏప్రిల్ 20 నాటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, హౌస్ ట్యాక్స్ రశీదులు, ఇంటి నిర్మాణ అనుమతి, గతంలో హైకోర్టు జడ్జి ఇచ్చిన ఆర్డర్ కాపీ మొదలైనవన్నీ నకిలీవేనని తేల్చింది. 2007లోనే తెలంగాణ రాష్ట్రం ఉన్నట్లుగా పిటిషనర్లు తప్పుడు పత్రాలను సమర్పించారని గుర్తించింది.
1990 సెప్టెంబర్ 4 నాటి హైకోర్టు ఉత్తర్వుగా పేర్కొంటూ 1992లో పొందినట్లుగా టైప్ చేసినవి పిటిషనర్ సమర్పించినవి కూడా బోగసే అని తేల్చింది. శంషాబాద్ గ్రామం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండగా, హైదరాబాద్ జిల్లాలో ఉన్నట్లుగా మరో రసీదులో పేర్కొన్నారు. ఈ విషయాలన్ని ఎంక్వైరీలో తేలాయి. 1997లో అసలు పిటిషన్లే నమోదు కాలేదని నివేదిక పేర్కొంది. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది.