మంత్రిపైనే అడవి బిడ్డల ఆశలు.. గత ప్రభుత్వ హయాంలో ములుగు జిల్లాపై నిర్లక్ష్యం

మంత్రిపైనే అడవి బిడ్డల ఆశలు.. గత ప్రభుత్వ హయాంలో ములుగు జిల్లాపై నిర్లక్ష్యం
  •     పునరుద్ధరణకు నోచని బిల్ట్, కాగితాలకే పరిమితమైన గోదావరి కరకట్ట
  •     చెరువులకు చేరని గోదారి నీళ్లు, అందని పోడు పట్టాలు
  •     నేడు మంత్రి హోదాలో జిల్లాకు రానున్న సీతక్క

ములుగు, వెలుగు : ములుగులో గత పదేళ్లుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేనే ఉండడంతో నియోజకవర్గ అభివృద్ధిని అధికార పార్టీ పట్టించుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌ అధికారం చేపట్టడం, ఆ పార్టీ నుంచి ములుగు ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచిన సీతక్క మంత్రిగా చార్జ్‌‌‌‌ తీసుకోవడంతో ఇప్పటికైనా అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయేమోనని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా ఆదివారం సీతక్క ములుగు జిల్లాకు రానున్నారు.

బిల్ట్‌‌‌‌ పునరుద్ధరణ జరిగేనా ?

ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లాలోనే ప్రధానమైన, వేలాది మందికి ఉపాధి కల్పించిన ములుగు జిల్లా మంగపేట మండలంలోని బిల్ట్‌‌‌‌ ఫ్యాక్టరీని 2014లో మూసి వేశారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం ఏర్పడిన ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కార్మికులు నెలల తరబడి దీక్షలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. రాయితీలు ఇస్తామని ప్రకటించారే తప్ప, ఫ్యాక్టరీని ఓపెన్‌‌‌‌ చేసేందుకు మాత్రం చర్యలు తీసుకోలేదు. ఈ ఫ్యాక్టరీని ఐటీసీ కంపెనీ టేకోవర్‌‌‌‌ చేసిందని కొన్ని నెలల క్రితం ప్రచారం జరిగింది. స్థలాన్ని సర్వే చేసి వదిలేశారే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం, మంత్రి సీతక్క స్పందించి ఫ్యాక్టరీని తెరిపించాలని కార్మికులు కోరుతున్నారు.

కరకట్ట.. కాగితాలకే పరిమితం

గోదావరి వరద ఉధృతి కారణంగా ములుగు జిల్లాలోని మంగపేట పట్టణ ప్రజలు ప్రతి సంవత్సరం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కరకట్ట నిర్మించాలని ప్రజలు అనేక సార్లు కోరారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే సీతక్క సైతం అసెంబ్లీలో చర్చ తీసుకువచ్చారు. కరకట్ట నిర్మాణానికి రూ. 150 కోట్లు కేటాయించామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పిన పాలకులు ఇప్పటి వరకు కూడా కరకట్ట నిర్మాణాన్ని మొదలుపెట్టలేదు. అలాగే ములుగు జిల్లాలోని చెరువులకు గోదావరి నీరు అందడం కలగానే మారింది. దేవాదులా ద్వారా చెరువులకు నీటిని అందించాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. అలాగే రామప్పను రిజర్వాయర్‌‌‌‌గా మార్చడంతో 1600ల ఎకరాలు నీటమునిగాయి. ఆ భూములకు సంబంధించిన పరిహారాన్ని కూడా రైతులకు చెల్లించలేదు.

మేడారానికి జాతీయ హోదా దక్కేనా ?

ఆదివాసీల ఆరాధ్యదైవాలైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ విషయంపై మంత్రి సీతక్క సైతం కేంద్రానికి విన్నవించారు. అలాగే త్వరలో జాతర జరగనున్నందున పనులు వేగంగా పూర్తి చేయేలా చర్లు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా వరంగల్‌‌‌‌ నుంచి మేడారం వచ్చే భక్తులకు ఆరెపల్లి నుంచి గట్టమ్మ వరకు జరుగుతున్న హైవే విస్తరణ పనుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ పనుల్లో వేగం పెంచి జాతర నాటికి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. అలాగే ములుగులో బస్‌‌‌‌ డిపో, సెంట్రల్‌‌‌‌ ట్రైబల్‌‌‌‌ వర్సిటీ క్లాస్‌‌‌‌ల ప్రారంభం, ములుగులో మినీ స్టేడియం, పార్కుల నిర్మాణం వంటి పనులు పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు.

నేడు ములుగుకు రానున్న సీతక్క

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతక్క మొదటిసారిగా ఆదివారం ములుగుకు రానున్నారు. మహ్మద్​గౌస్​ పల్లి నుంచి భారీ ర్యాలీగా గట్టమ్మ వద్దకు చేరుకొని మొక్కులు చెల్లించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ములుగు మీదుగా మేడారం వెళ్తారు. అక్కడ మేడారం జాతరపై రివ్యూ నిర్వహించనున్నారు. ములుగుకు వస్తున్న సీతక్కకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్​ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సీతక్క విజయోత్సవ ర్యాలీని సక్సెస్‌‌‌‌ చేయాలని ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల అధ్యక్షులు చిటమట రఘు, ఎండీ. అఫ్సర్‌‌‌‌ కోరారు.