అగ్నిప్రమాదంపై జీహెచ్ఎంసీ మేయర్ దిగ్భ్రాంతి

అగ్నిప్రమాదంపై జీహెచ్ఎంసీ మేయర్ దిగ్భ్రాంతి

ఫైర్ సేఫ్టీ లేని భవనాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మీ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో  8 మంది మరణించిన సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్, ఈవీడీఎమ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జరిగిన ప్రమాదంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని భవన యజమానిపై క్రిమినల్ కేసు పెట్టడమే కాకుండా విచారణకు ఆదేశాలు జారీ చేసిందని మేయర్ గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

మరోవైపు సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతిచెందిన ఎనిమిది మంది వివరాలను అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్ లో రూబీ ఎలక్ట్రిక్ షోరూం, హోటల్ మొత్తం ఐదంతస్తుల్లో ఉంది. షోరూంలో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ-స్కూటర్లు ఒక్కొక్కటిగా వరుసపెట్టి పేలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ, మంటలు షోరూంపైన ఉన్న రూబీ హోటల్ కు వేగంగా వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలిసేలోపే కొందరు స్పాట్ లోనే చనిపోయారు. గాయాలైన 9 మందిని యశోద, గాంధీ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్రం ప్రభుత్వం రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించగా..కేంద్రం రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.