జగిత్యాలలో చోరీ.. రూ.1.50 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు

జగిత్యాలలో చోరీ..  రూ.1.50 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు

హోల్ సేల్ దుకాణంలో చోరీ చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఐటీసీ బ్రాండ్ సేల్ దుకాణం ఉంది. జూన్ 25 న తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు గ్రౌండ్ ఫ్లోర్లోని గ్రిల్స్ కోసి ఫస్ట్ ఫ్లోర్లోకి ప్రవేశించారు. అనంతరం అక్కడి షట్టర్ ని పగలగొట్టారు.

అనంతరం దుకాణంలోని సుమారు రూ.1.50 లక్షల నగదు, సీసీ టీవీ ఫుటేజీ డీవీఆర్ ని ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే షట్టర్ ఓపెన్ చేసిన యజమాని  చోరీ జరిగిన విషయాన్ని గమనించాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ నరేష్, ఎస్ఐ రహీంలు సీసీ ఫుటేజీని పరిశీలించారు. మారుతి వ్యాన్ లో వచ్చి ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.