మేక చోరీకి యత్నించి.. రివాల్వర్‪తో బెదిరించి పరార్

మేక చోరీకి యత్నించి.. రివాల్వర్‪తో బెదిరించి పరార్

మెదక్ జిల్లా: హైదరాబాద్ లోని బేగంపేటలో ఇద్దరు దొంగలు ఇంట్లోకి దూరి తుపాకీతో బెదిరించి చోరీకి ప్రయత్నించగా.. తల్లికూతుళ్లు కలిసి వారిని తరిమారు. అలాంటి ఘటనే శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. మేకను చోరీ చేసి దొరికిపోయిన దుండగులు రివాల్వర్‪తో బెదిరించి తప్పించుకున్నారు. రెడ్డిపల్లి గ్రామంలో భీం రావు, మధు ఇద్దరు కలిసి మేకని చోరీ చేసేందుకు ప్రయత్నించారు. 

గ్రామ యువకులు వారిని గమనించి వెంబడించడంతో దుండగులు పరారైయ్యారు. నర్సాపూర్ చౌరస్తా వద్ద ఇద్దరినీ పట్టుకొని రెడ్డిపల్లి తీసుకెళ్తుండగా రివాల్వర్ తో బెదిరించి భీం రావు, మధులు తప్పించుకున్నారు. రివాల్వర్ చూసి ఒక్కసారిగా భయపడిన యువకులు బైక్ పైనుంచి కింద పడటంతో తీవ్ర గాయాలు అయ్యారు. వారు నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన యువకులకు హాస్పిటల్ లో చేర్పించారు.