న్యూఢిల్లీ:పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్పై బ్యాన్ను సోమవారం (మే 23) నుంచి ఎత్తేస్తామని ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. లోకల్గా పెరిగిన వంటనూనె రేట్లను తగ్గించడానికి పామ్ ఆయిల్ బ్యాన్ విధించిన అక్కడి ప్రభుత్వం, రేట్లు తగ్గకపోయినా బ్యాన్ను తొలగించింది. లీటర్ వంట నూనె రేటును 14,000 రూపియా (సుమారు రూ.74) కిందకు తీసుకురావాలని ఇండోనేషియా ప్రభుత్వం మొదటిలో నిర్ణయించుకుంది. రేట్లు తగ్గకపోయినప్పటికీ, పామాయిల్ ఇండస్ట్రీపై ఆధారపడి బతుకుతున్న 1.6 కోట్ల మంది రైతుల కోసం, 1.7 కోట్ల మంది వర్కర్ల కోసం బ్యాన్ను ఎత్తేస్తున్నామని ఆ దేశ ప్రెసిడెంట్ జోకో విడోడో పేర్కొన్నారు. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభంతో గ్లోబల్గా సన్ఫ్లవర్ ఆయిల్ షార్టేజ్ నెలకొన్న విషయం తెలిసిందే. సోయాబిన్ దిగుబడి తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో వంట నూనె అవసరాల కోసం ఇండియా ఎక్కువగా పామాయిల్పై ఆధాపడుతోంది. పామాయిల్ను బ్యూటీ ప్రొడక్ట్ల తయారీలోనూ వాడతారు. బయో ఫ్యూయల్గా కూడా వినియోగిస్తారు. ఇండోనేషియా పామాయిల్ బ్యాన్ పెట్టడంతో ఇండియాతో సహా చాలా దేశాల్లో కుకింగ్ ఆయిల్ రేట్లు పెరిగాయి.ఈ బ్యాన్ ఎత్తేయడం ఇండియాకు మేలు చేస్తుంది.
బ్యాన్ ఎత్తేయడం మనకు మంచిదే..
దేశ వంట నూనె అవసరాల్లో 70 % వాటాను దిగుమతులు ద్వారానే చేరుకుంటున్నాం. గ్లోబల్గా వంట నూనె రేట్లు పెరగడంతో వీటి సప్లయ్ పడిపోతోంది. గత రెండు సీజన్ల (నవంబర్ నుంచి అక్టోబర్) లో దేశంలోకి వచ్చే వంట నూనెల షిప్మెంట్స్ తగ్గాయి. 2020–21 లోనే 1.5 కోట్ల టన్నుల షిప్మెంట్స్ పడిపోయాయి. వంట నూనెల దిగుమతుల్లో కూడా పామాయిల్ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. మొత్తం వంట నూనె దిగుమతుల్లో పామాయిల్ వాటా 60% ఉంటుందని అంచనా. ఇండియా ఎక్కువగా ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్ను దిగుమతి చేసుకుంటోంది. కిందటి సీజన్లో మొత్తం వంట నూనె దిగుమతుల్లో 57 శాతం వాటా క్రూడ్ పామాయిల్ ఉంది. ఇండోనేషియా పామాయిల్ బ్యాన్ ఎత్తేస్తే మనకు వచ్చే షిప్మెంట్స్ పెరుగుతాయి. ఫలితంగా దేశంలో వంట నూనె రేట్లు దిగొచ్చే అవకాశం ఉంటుంది.