రూపాయి కూడా ఇయ్యలే..అల్లాజీ అంత్యక్రియలు పూర్తి

రూపాయి కూడా ఇయ్యలే..అల్లాజీ అంత్యక్రియలు పూర్తి
  •     శవం కుళ్లిపోతుండడంతో ఖననం చేసిన కుటుంబసభ్యులు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్ట్​ కోసం ప్రభుత్వం తీసుకున్న భూమికి పరిహారం ఇవ్వకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నాగర్​కర్నూల్​ జిల్లా కుమ్మెర గ్రామానికి చెందిన అనంత అల్లాజీ అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. అయితే, సర్కారు నుంచి గాని, అధికారుల నుంచి గాని, ప్రజాప్రతినిధుల నుంచి గాని అల్లాజీ కుటుంబానికి రూపాయి కూడా దక్కలేదు. అల్లాజీ బుధవారం ఆత్మహత్య చేసుకోగా తమకు న్యాయం జరిగేంత వరకు శవాన్ని తీసేది లేదని కుటుంబసభ్యులు, గ్రామస్తులు భీష్మించుకు కూర్చున్నారు. వీరికి పలు పార్టీల లీడర్లు మద్దతు పలికారు. దీంతో పోలీసులు ఊరిలో పికెటింగ్​ పెట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ALSO READ: మంత్రి మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు..పర్మిషన్లు తీసుకోకుండానే  వరంగల్ హైవేకు ఆనుకుని పనులు?

బుధ, గురువారాల్లో లీడర్లను అదుపులోకి తీసుకున్నారు. గురువారం కూడా కుటుంబసభ్యులు డెడ్​బాడీని అంత్యక్రియలకు తరలించకపోవడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అధికారులు, పోలీసులు న్యాయం జరిగేలా చూస్తామని అల్లాజీ కుటుంసభ్యులకు నచ్చజెప్పినా వినలేదు. గురువారం రాత్రి ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి..సర్పంచ్ ​తిరుపతి రెడ్డిని పంపించి మాట్లాడించారు. 7 ఎకరాల భూమికి ఎకరాకు రూ.10 లక్షల చొప్పున ఇప్పిస్తామని, వ్యక్తిగతంగా రూ.5లక్షలు ఇచ్చి రైతు భీమా రూ.5లక్షలు వచ్చేలా చూస్తానని చెప్పించారు. అధికారులు రాత పూర్వకంగా ఇస్తేనే ఒప్పుకుంటామని బంధువులు స్పష్టం చేశారు. అప్పటికే అర్ధరాత్రి కావడంతో ప్రయత్నాలను విరమించుకున్నారు. అయితే, అల్లాజీ చనిపోయి శుక్రవారానికి మూడు రోజులవుతుండడంతో డెడ్​బాడీ కుళ్లిపోతుందని అంత్యక్రియలు పూర్తి చేశారు.