బైక్‌ను ఢీకొట్టి 2 కి.మీ ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్

బైక్‌ను ఢీకొట్టి 2 కి.మీ ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్

ఎల్ బీనగర్,వెలుగు:  చంపాపేటలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. బైక్​ను ఢీ కొట్టి.. ఆపై రెండు కిలో మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. అనంతరం మరో కారును ఢీకొట్టి  ఆగకుండా వెళ్లిపోయింది. ఐఎస్ సదన్ పోలీసులు తెలిపిన ప్రకారం... ఈదీ బజార్​కు చెందిన వ్యాపారి మహ్మద్ అబ్దుల్ మజీద్ (60 ) మంగళవారం అర్ధరాత్రి తన బైక్​పై చంపాపేట లక్ష్మిగార్డెన్ నుంచి వెళ్తున్నాడు. అదే టైంలో వెనుక నుంచి వచ్చిన ఓ లారీ డ్రైవర్ బైక్‌‌ను ఢీకొట్టాడు.  దీంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి కింద పడిపోయాడు. అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ బైక్ ను లారీ  రెండు కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. బైకర్ లారీ ఫుట్ బోర్డుపై నిలబడి కేకలు వేసినా డ్రైవర్ పట్టించుకోకుండా వెళ్లాడు. అనంతరం చంపాపేట టీ జంక్షన్ వద్ద మరో కారును ఢీకొట్టి ఆగకుండా వెళ్లి పోయాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి డ్రైవర్​ను అరెస్ట్ చేసి  లారీని సీజ్ చేశామని  ఐఎస్ సదన్ పోలీసులు తెలిపారు. లారీ ఢీకొట్టుకుంటూ వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.