గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టే ప్రయత్నం
అడ్డుకున్న తల్లిదండ్రులు, బంధువులు
ప్రేమ వ్యవహారంలో మర్డర్ చేశారని కేసు నమోదు
నిజామాబాద్ జిల్లాలో ఘటన
టీఆర్ఎస్ లోకల్ లీడర్లపై ఆరోపణలు
డెడ్బాడీతో గ్రామస్థుల ఆందోళన
మోర్తాడ్, వెలుగు: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం హాసకొత్తూర్ గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతడిని టీఆర్ఎస్ లీడర్, అతని అనుచరులు కొట్టి చంపి కొవిడ్తో చనిపోయినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మృతుని తల్లిదండ్రుల కథనం ప్రకారం.. మారుతీనగర్ కాలనీ కి చెందిన మాలావత్ సిద్దార్థ్(17) హార్వెస్టర్ నడుపుతాడు. బీజేవైఎం కార్యకర్తగా గ్రామ రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నాడు. కొంతకాలంగా గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత కనకం రాజేశ్ బంధువైన యువతిని సిద్ధార్థ్ ప్రేమిస్తున్నాడు. ఈ విషయంలో సిద్ధార్థ్, రాజేశ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. గతంలో రెండుసార్లు సిద్ధార్థ్పై రాజేశ్ దాడి చేశాడు. కానీ సిద్ధార్థ్ ప్రేమ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో గురువారం ఉదయం పనికివెళ్లిన సిద్దార్థ్ ను రాజేశ్, అతని అనుచరులు కలిసి కిడ్నాప్చేశారని, ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి కొట్టి చంపేశారని బాధితుని తల్లిదండ్రులు మాలావత్సరోజ, శ్రీను ఆరోపించారు.
కొవిడ్తో చనిపోయినట్లు డ్రామా
గ్రామస్థుల కథనం ప్రకారం.. రాజేశ్, అతని అనుచరులు కొట్టిన దెబ్బలకు సిద్ధార్థ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు చెప్పడంతో డెడ్బాడీని ఊరికి తీసుకొచ్చారు. వస్తూనే హాసకొత్తూర్సర్పంచ్కు ఫోన్ చేసి, గ్రామానికి చెందిన సిద్ధార్థ్ కొవిడ్తో చనిపోయాడని, శివారులో గుంత తవ్వి రెడీగా ఉంచాలని సూచించారు. దీంతో సర్పంచ్ జేసీబీతో గుంత తీసి పెట్టి అతని తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. విషయం తెలిసిన గ్రామస్థులంతా డెడ్బాడీ ఖననాన్ని అడ్డుకున్నారు. పొద్దున్నే పనికి వెళ్లిన మనిషి కొవిడ్తో ఎలా చనిపోతాడని ప్రశ్నించారు. మృతదేహాన్ని టీఆర్ఎస్ నేత రాజేశ్ ఇంటి ముందు వేసి ఆందోళనకు దిగారు. ఇంటిపై కి రాళ్లు విసిరారు. పోలీసులు చేరుకొని బాధితులతో మాట్లాడారు. సిద్ధార్థ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కనుకం రాజేశ్, ఇంకొందరిపై మర్డర్ కేసు నమోదు చేశామని ఆర్మూర్ ఏసీపీ రఘు తెలిపారు. పూర్తి ఎంక్వైరీ చేసి హంతకులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.
టీఆర్ఎస్నేతలను అరెస్ట్ చేయాలి : అర్వింద్
బీజేపీ కార్యకర్త మాలావత్ సిద్దార్థ్ను అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత కనకం రాజేశ్, అతని అనుచరులైన బాలాగౌడ్, పృథ్వీరాజ్, అన్వేష్ తదితరులు కర్రలు, బీరు సీసాలతో కొట్టి చంపారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఈమేరకు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. టీఆర్ఎస్నేత, అతని అనుచరులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.