సమాజంలో జరుగుతున్న అత్యాచారాలకు శిక్ష ఉరి వేసి చంపడం, కాల్చి చంపడం అనేవి శాశ్వత పరిష్కారం కాదన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. దిశ లాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే.. ముందు సమాజంలో మార్పు రావాలన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించారు మంత్రి ఈటల. అనంతరం మానవ వికాస వేదిక మహా సభలో ప్రసంగిస్తూ… సెల్ ఫోన్లు, టీవీలు, టెక్నాలజీ… మనిషి బాగు పడటం కోసం, సుఖమయ జీవనం కోసం ఉపయోగపడాలి.. కానీ ఈనాడు అవే మానవ జీవితాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. తాను సృష్టించిన టెక్నాలజీ.. విధ్వంసం కూడా చేస్తుందని మనిషి ఊహించలేకపోయాడన్నారు.
కంచె చేను మేసినట్లుగా తన పిల్లల పైనే తండ్రి క్రూరమృగంగా ప్రవర్తిస్తున్నారని, ఆడపిల్లలకు ఇంట్లో కూడా రక్షణ కరువైందని మంత్రి అన్నారు. చాలామంది తల్లిదండ్రులకు వారి పిల్లల భవిష్యత్తుపై భయమేస్తుందని,వారు బయటకు వెళ్లి క్షేమంగా వెళ్లి వస్తారో లేదో అని భయపడుతున్నారని ఆయన అన్నారు.
నాగరికత నేర్చుకున్న ప్రపంచంలో మానవ సంబంధాలు నాశనం అయ్యాయని అన్నారు. మానవులకు, జంతువులకు గల తేడాలను గమనించాలన్నారు. మానవ వికాస వేదిక లాంటి సంస్థలు ప్రజలను చైతన్య పరచాలని చెప్పారు. టెక్నాలజీ ఇంత పెరిగినా.. ప్రపంచంలో మూఢ నమ్మకాలు, మంత్రాల నెపంతో చంపడం దుర్మార్గమని, ఇలాంటి అనాగరికమైన సంఘటనలు జరగకూడదని అన్నారు. అంబేద్కర్ కన్న కలలు నెరవేరాలని మంత్రి కోరారు.
More News