జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయండి

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయండి

తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ టీపీఎస్ఎఫ్ అధ్యక్షుడు గౌరినేని రాజేశ్వర్ రావు నేతృత్వంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. గత మూడేండ్లుగా పని చేస్తున్నా తమను రెగ్యులరైజ్ చేయలేదని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారని.. తమ సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రిని కోరారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల విజ్ణప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. 

ఆదిలాబాద్ జిల్లా నేరెడుగొండు మండలం పీచర గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శి రాజ్ కుమార్ ఆర్.ఓ.ఎఫ్.ఆర్ సర్వేలో భాగంగా విధులు నిర్వహించి ఇంటికి వెళ్తుండగా ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే రాజ్ కుమార్ కు మెరుగైన వైద్య అందించాలని జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. అనంతరం రాజ్ కుమార్ చేరిన హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులతో మాట్లాడారు. రాజ్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.