మిస్​ వరల్డ్​గా పోలండ్​ సుందరి

మిస్​ వరల్డ్​గా పోలండ్​ సుందరి
  • మిస్​ వరల్డ్​గా కరోలీనా బీలాస్కా
  • పోలెండ్​ బ్యూటీకి దక్కిన అందాల కిరీటం

పోర్టోరికో: మిస్​ వరల్డ్​ 2021 అందాల కిరీటాన్ని పోలండ్​ సుందరి కరోలీనా బీలాస్కా దక్కించుకుంది. మిస్​ వరల్డ్​ 70వ ఎడిషన్​ పోర్టోరికో సాన్​ జూన్​లోని కోకాకోలా మ్యూజిక్​ హాలులో గురువారం జరిగింది. జమైకాకు చెందిన 2019 మిస్​ వరల్డ్​ విజేత టోనీ-ఆన్​ సింగ్.. 23 ఏండ్ల కరోలీనా బీలాస్కాకు మిస్​ వరల్డ్​ కిరీటాన్ని పెట్టారు. అమెరికాకు చెందిన శ్రీ సైనీ ఫస్ట్​ రన్నరప్​గా నిలిచింది. ఈమె అమెరికన్–ఇండియన్​ కావడం విశేషం. కోట్ ది ఐవరీకి చెందిన ఒలీవియా యేస్ సెకండ్ రన్నరప్​గా నిలిచింది. 40 మంది సెమీఫైనలిస్టులు డిసెంబర్​లో జరిగిన ఫైనల్స్​ కోసం పోర్టోరికో చేరుకున్నారు. కానీ, కరోనా విజృంభణ కారణంగా కంటెస్టెంట్లు వైరస్​ బారిన పడటంతో ఈవెంట్​ వాయిదా పడింది. 

నా జీవితాంతం మరిచిపోలేను: కరోలీనా
‘‘నా పేరు ప్రకటించిన తర్వాత నోట మాట రాలేదు. ఇప్పటి వరకు జరిగిన ఘటనలను ఒకసారి మళ్లీ గుర్తు తెచ్చుకుంటేగానీ జరిగింది నమ్మలేను. ఇప్పటికీ నేను గెలిచానంటే నమ్మలేకపోతున్నాను. మిస్​ వరల్డ్​ కిరీటం ధరించడం గొప్ప గౌరవం. నా పనిలోకి దిగేందుకు ఇక వేచిచూడలేను. పోర్టోరికోలో జరిగిన ఈ అధ్యాయాన్ని నా జీవితాంతం మరిచిపోలేను”అని ఆనంద భాష్పాల మధ్య  కరోలీనా ప్రకటించింది. కరోలీనా విజయం పట్ల తాము చాలా గర్వపడుతున్నామని శ్రీసైనీ, ఒలీవియా స్పష్టం చేశారు. కరోలీనా ప్రస్తుతం మేనేజ్​మెంట్​లో మాస్టర్స్​ డిగ్రీ చేస్తోంది. ఆ తర్వాత పీహెచ్​డీ చేసేందుకు ఆమె సిద్ధమవుతోంది. మోడల్​గానూ పనిచేస్తున్న ఆమె.. ఏదో ఒక రోజు మోటివేషనల్​ స్పీకర్​గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్విమ్మింగ్ చేయడం, స్కూబా డైవింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడటం కరోలీనాకు ఇష్టం. ఇండ్లు లేని వారికి సహాయం చేయడానికి వలంటరీగానూ కరోలీనా పనిచేస్తోంది. ఇందుకోసం జుపా నా పెయిట్రీని పేరుతో ఒక ప్రాజెక్టును నడుపుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా పోలెండ్​లోని లోడ్జ్​ సిటీలో ప్రతి ఆదివారం ఇండ్లు లేని వారికి ఆహారం, తాగునీరు, దుస్తులు, మాస్క్​లు, న్యాయ సహాయం, వైద్య సహాయం అందిస్తోంది. 

11వ ప్లేస్​లో మన మానస
మన దేశం తరఫున మిస్​ వరల్డ్​ పోటీల్లో పాల్గొన్న మానసా వారణాసి 11వ ప్లేస్​తో సరిపెట్టుకుంది. టాప్​ 13 కంటెస్టెంట్ల వరకూ మానస చేరుకున్నా.. టాప్​ 6లోమాత్రం చోటు దక్కలేదు. హైదరాబాద్​లో పుట్టిన మానస.. 2020లో ఫెమీనా మిస్​ ఇండియా పోటీల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించి విజేతగా నిలిచి మిస్​ వరల్డ్​ పోటీలకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.