చెరువులో పడి తల్లీకూతుళ్లు మృతి

చెరువులో పడి తల్లీకూతుళ్లు మృతి

దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లాలో బట్టలు ఉతికేందుకు చెరువుకు వెళ్లిన తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మిరుదొడ్డి మండలం వీరారెడ్డిపల్లికి చెందిన చెప్యాల రోజా(30)కు ఇద్దరు కూతుళ్లు సౌజన్య(8), చైత్ర(5). బతుకమ్మ పండుగ చేసుకునేందుకు రోజా పిల్లలను తీసుకుని తల్లిగారి ఊరైన దుబ్బాక మండలం ఎనగుర్తికి వెళ్లింది. బుధవారం బట్టలు ఉతికేందుకు కూతుళ్లతో గ్రామంలోని బండ కుంట చెరువు వద్దకు వెళ్లింది. రోజా బట్టలు ఉతుకుతుండగా పిల్లలు గట్టు మీద ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్న కూతురు చైత్ర ప్రమాదవశాత్తు జారి చెరువులో పడింది. గమనించిన తల్లి చిన్నారిని కాపాడబోయి ఆమె కూడా నీట మునిగింది. పెద్ద కూతురు సౌజన్య ఏడుస్తూ గ్రామంలోకి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పింది. గ్రామస్తులు చెరువులో గాలించి ఇద్దరి డెడ్​బాడీలను బయటకు తీశారు. తల్లి, చెల్లి మృత దేహాలను చూసి సౌజన్య రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. రోజా భర్త ఏడాదిన్నర కింద ఆత్మహత్య చేసుకోగా అప్పటి నుంచి అన్నీ తానై చూసుకుంటోంది. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో పెద్ద కూతురు అనాథగా మారింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన భూంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.