హైదరాబాద్: పాతబస్తీ లో సత్ప్రవ్తన కలిగి, నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ ల పేర్లను పోలీస్ రికార్డుల్లో నుంచి తొలగించారు సౌత్ జోన్ పోలీసులు. సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ ల మేళాను సాలార్ జుంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్, క్రైమ్స్ అదనపు సీపీ చౌహాన్, సౌత్ జోన్ ఇంఛార్జి డీసీపీ గజర భూపాల్, ఆయా జోన్స్ ఏసీపీ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ఓల్డ్ సిటీలో సత్ప్రవర్తన కలిగి నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ ల పేర్లను పోలీస్ రికార్డుల్లో నుంచి తొలగించామన్నారు. వారంతా కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. గతంలో తప్పులు చేసి, నేరాలు చేసి జైలు కు వెళ్లిన వీరు.. ఇదొక సదవకాశంగా భావించి, అందరికీ ఆదర్శంగా ఉంటూ.. కుటుంబం తో సంతోషంగా జీవించాలని, సాధారణ పౌరులుగా వుండాలని కోరుతున్నానని అన్నారు. సమాజంలో మంచిగా, బాధ్యతగా మెలగాలని అన్నారు. ఒకవేళ మళ్లీ ఎలాంటీ నేరాలు చేసినా, లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించినా తిరిగి జైలు కు పంపిస్తామని చెప్పారు.