కాంగ్రెస్ నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే ప్రకటించారు. ఈ కమిటీలో ఆయనతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా పలువురు సీనియర్ నేతలకు అవకాశం దక్కింది.
వీరితో పాటు గత కొంత కాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై ముభావంగా ఉంటోన్న ఆనంద్ శర్మ, శశిథరూర్, సచిన్ పైలట్ సహా పలువురు జీ-23 నేతలకు కూడా వర్కింగ్ కమిటీలో చోటు దక్కడం మరో విశేషం.
మల్లిఖార్జున్ ఖర్గే 39 మంది సభ్యులతో కూడిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించారు. వీరిలో 32 మందిని శాశ్వత సభ్యులుగా ప్రకటించారు. 13 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటించారు.
ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ మంత్రి రఘువీరా రెడ్డికి చోటు కల్పించారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మాత్రం అవకాశం దక్కలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత టి.సుబ్బిరామిరెడ్డిని శాశ్వత ఆహ్వానితుడిగా ఖర్గే ప్రకటించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లంరాజు, చల్లా వంశీచందర్ రెడ్డి పేర్లను ప్రకటించారు.