కరోనా వ్యాక్సిన్ సృష్టికర్తకు నోబెల్ బహుమతి

కరోనా వ్యాక్సిన్ సృష్టికర్తకు నోబెల్ బహుమతి

Nobel Prize : వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం (Nobel Prize)-2023 కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌లను వరించింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియోసైడ్‌ బేస్‌ మాడిఫికేషన్లకు సంబంధించిన ఆవిష్కరణలకు ఈ ఇద్దరికి అవార్డును ప్రకటించారు. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ బృందం సోమవారం (అక్టోబర్ 2న) ప్రకటించింది. 

వైద్యవిభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రదానం వారంపాటు కొనసాగనుంది. శుక్రవారం రోజున 2023 నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబర్‌ 9వ తేదీన అర్థశాస్త్రంలో నోబెల్‌ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడించనున్నారు. నోబెల్‌ పురస్కారాల గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతిని ఈ ఏడాది పెంచారు. గతేడాది గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్ల నగదు అందజేయగా.. ఈసారి దాన్ని 11 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్లకు పెంచారు. స్వీడిష్‌ కరెన్సీ విలువ పడిపోతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబరు 10వ తేదీన గ్రహీతలకు అందజేయనున్నారు.

స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. గతేడాది మానవ పరిణామక్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్‌ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు స్వాంటె పాబో ఈ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.