మహారాష్ట్రలో ఒక్క రోజే 198 ఒమిక్రాన్ కేసులు

మహారాష్ట్రలో ఒక్క రోజే 198 ఒమిక్రాన్ కేసులు

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రమవుతోంది. రోజు రోజుకూ కొత్త కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఇవాళ (గురువారం) ఒక్క రోజే 198 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ పేషెంట్ల సంఖ్య 450కి చేరినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన 198 కేసుల్లో ఒక్క ముంబైలోనే 190 వచ్చాయి.


ఒక్క రోజే 5 వేలకు పైగా కేసులు.. 22 డెత్స్

మరోవైపు మొత్తంగా కరోనా కేసుల వ్యాప్తి కూడా మహారాష్ట్రను వణికిస్తోంది. రికార్డు స్థాయిలో ఈ ఏడాది సెకండ్ వేవ్ మొదలైన సమయంలో వచ్చినట్లుగా కేసులు మొదలైపోయాయి. ఇవాళ ఒక్క రోజే మహారాష్ట్రలో కరోనా కేసులు 5,368 నమోదు కాగా, 22 మంది కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 18,217కు చేరింది. ముంబై సిటీలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ముంబైలోనే గడిచిన 24 గంటల్లోనే 3,671 కేసులు నమోదయ్యాయి.