4 ఏండ్లలో 6 లక్షల స్టూడెంట్లు తగ్గిన్రు.. 2024 నాటికి 16.86 లక్షలకు తగ్గుదల

4 ఏండ్లలో 6 లక్షల స్టూడెంట్లు తగ్గిన్రు.. 2024 నాటికి 16.86 లక్షలకు తగ్గుదల
  • సర్కారు బడుల్లో 2021లో 23.25 లక్షల విద్యార్థులు..
  • 2024 నాటికి 16.86 లక్షలకు తగ్గుదల
  • 11 ఏండ్లలో పడిపోయిన 8 లక్షల స్ట్రెంత్
  • పదేండ్లలో 1:22 నుంచి 1:16కు
  • తగ్గిన టీచర్, స్టూడెంట్​ రేషియో
  • ఈ ఏడాది అడ్మిషన్లు పెంచేందుకు సర్కారు కసరత్తు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో గత కొన్నేండ్లుగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విద్యార్థుల సంఖ్య భారీగా పెరగాల్సి ఉండగా, పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండటం ఆందోళనకరంగా మారింది. గడిచిన నాలుగేండ్లలో సర్కారు బడుల్లో ఏకంగా ఆరు లక్షలకు పైగా స్టూడెంట్లు తగ్గిపోవడం కలవరపెడుతోంది. కరోనా టైంలో ఏకంగా మూడున్నర లక్షల కొత్త అడ్మిషన్లు వచ్చినా, వాటిని నిలబెట్టుకోవడంలో నాటి ప్రభుత్వం, విద్యాధికారులు విఫలమయ్యారు. మరోపక్క టీచర్ల సంఖ్య పెరుగుతున్నా, విద్యార్థుల సంఖ్య మాత్రం తగ్గుతుండడంపై విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు బడుల్లో అడ్మిషన్లు గణనీయంగా పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది.

అడ్మిషన్లు పెరిగినా కాపాడుకోలే..
రాష్ట్రంలో 26,105 సర్కారు స్కూళ్లు ఉండగా, వాటిలో గత విద్యాసంవత్సరంలో 16.86 లక్షల మంది చదివారు. 2021–22 అకడమిక్ ఇయర్ లో 23 లక్షల 25 వేల 937 మంది స్టూడెంట్లు ఉండగా, 2024–25లో ఆ సంఖ్య 16 లక్షల 86 వేల343కు పడిపోయింది. ఈ లెక్కన కేవలం నాలుగేండ్లలో 6 లక్షల 39 వేల 594 మంది విద్యార్థులు తగ్గినట్లు స్పష్టమవుతోంది. కాగా, కరోనా టైమ్ లో 2020–21లో 19.73 లక్షల మంది స్టూడెంట్లు ఉండగా, ఆ తర్వాతి ఏడాది వీరి సంఖ్య 23.25 లక్షలకు చేరింది. అంటే ఆ ఏడాది సర్కారు బడుల్లో మూడున్నర లక్షలకు పైగా విద్యార్థులు పెరిగారు. కరోనా కారణంగా తమ పిల్లలను ప్రైవేట్​బడులకు పంపడం ఇష్టం లేక పేరెంట్స్ ప్రభుత్వ స్కూళ్లవైపే మొగ్గు చూపారు. అయితే, ఇలా వచ్చిన స్టూడెంట్లను ప్రభుత్వ బడుల్లోనే కొనసాగేలా చూడడంలో అప్పటి ప్రభుత్వం, విద్యాధికారులు విఫలమయ్యారు.

విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ ఒక్కరంటే ఒక్క టీచర్​ను కూడా కొత్తగా నియమించని బీఆర్ఎస్ సర్కారు, ఉన్న విద్యావలంటీర్లను కూడా తొలగించింది. దీంతో టీచర్లు లేరనే కారణంగా 3 లక్షల మంది విద్యార్థులు మళ్లీ ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయారు. మొత్తంగా గడిచిన11 ఏండ్లలో సర్కారు బడుల్లో ఏకంగా 8 లక్షల మంది స్టూడెంట్లు తగ్గిపోయారు. విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఆ మేరకు టీచర్, స్టూడెంట్ రేషియో కూడా తగ్గుతోంది. పడేండ్ల కింద సగటున 22 మంది స్టూడెంట్లకు ఒక టీచర్ ఉండగా, ప్రస్తుతం అది 16కు చేరింది. అయితే, కొత్తగా గురుకులాలు పెరగడం కూడా సర్కారు బడుల్లో అడ్మిషన్లు తగ్గడానికి ఒక కారణమని టీచర్లు చెబుతున్నారు.

టీచర్ల సంఖ్య పెరుగుతున్నా..
రాష్ట్రవ్యాప్తంగా 2021–22 విద్యా సంవత్సరంలో 1,03,651 మంది టీచర్లు పనిచేయగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1,08,490కి పెరిగింది. అంటే నాలుగేండ్లలో 4,839 మంది టీచర్లు పెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సుమారు 10 వేల మంది టీచర్లను కొత్తగా నియమించింది. మరోపక్క స్కూళ్ల సంఖ్య కూడా పెరిగింది. 2021లో 26,074 స్కూళ్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 26,105కు పెరిగింది.

గడిచిన నాలుగేండ్లలో టీచర్ల సంఖ్యతో పాటు బడుల పెంపునకు సర్కారు చర్యలు తీసుకున్నా.. పిల్లల సంఖ్య తగ్గడం ఆందోళనకరమైన అంశమని విద్యావేత్తలు చెప్తున్నారు. కాగా, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు బడుల బలోపేతంపై దృష్టి సారించింది. మన ఊరు.. మన బడి కార్యక్రమం ద్వారా సర్కారు స్కూళ్లలో మౌలిక వసతుల సంఖ్యను పెంచడంతో పాటు టీచర్ పోస్టుల ఖాళీలనూ భర్తీ చేసింది. మరోవైపు క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసమూ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో వేసవి సెలవుల్లో టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వగా, ప్రస్తుతం బడిబాట కార్యక్రమం ద్వారా అడ్మిషన్లు పెంచే ప్రయత్నం చేస్తోంది.