టీఆర్ఎస్ లీడర్ల కనుసన్నల్లో పోలీసింగ్..

టీఆర్ఎస్ లీడర్ల కనుసన్నల్లో పోలీసింగ్..
  • లీడర్ల కనుసన్నల్లో పోలీసింగ్​
  • వాళ్లు సైగ చేస్తే కేసు, వద్దంటే  మాఫీ
  • రికమండేషన్​ లెటర్  ఉంటేనే పోస్టింగ్
  • మంత్రులు, లీడర్ల కోసమే పోలీసులు
    పనిచేస్తున్నారంటూ ప్రతిపక్షాల ఫైర్​

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో పోలీస్​ డిపార్ట్​మెంట్​ను మినిస్టర్లు, టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు శాసిస్తున్నారు. ఎస్​ఐ నుంచి డీఎస్పీ దాకా.. పోలీసు ఆఫీసర్లకు ఎక్కడ  పోస్టింగ్​ ఇవ్వాలన్నా, ఎక్కడికి ట్రాన్స్​ఫర్​ కావాలన్నా ఎమ్మెల్యేల రికమండేషన్​ లెటర్  కంపల్సరీ అనే రూల్​ అనధికారికంగా అమలవుతోంది. ఐపీఎస్​లు మినహా అన్ని ర్యాంకుల పోలీసు ఆఫీసర్లు ఎమ్మెల్యేల ముందు క్యూ కట్టాల్సి వస్తోంది. ఏ పోలీస్​ ఆఫీసర్​ ఏ పోలీస్​ స్టేషన్​లో కొనసాగాలో కూడా లీడర్లే డిసైడ్​ చేస్తున్నారు. తమతో మంచిగా ఉండేవాళ్లను తమ నియోజకవర్గ పరిధిలోని స్టేషన్లలో తెచ్చిపెట్టుకుంటున్నారు. లీడర్ల చేతుల్లోనే రిమోట్​ ఉండటంతో వారికి అనుకూలంగానే పోలీసులు పనిచేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. బుధవారం పెద్దపల్లి జిల్లాలో జరిగిన లాయర్​ దంపతుల హత్య విషయంలోనూ ఇలానే వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. తమకు ప్రాణభయం ఉందని లాయర్ దంపతులు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, పోలీసులు రక్షణ కల్పించకపోవటం వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లే కారణమని ప్రతిపక్షాలు అంటున్నాయి.

పోలీస్​ బాస్​లుగా లీడర్లు!

రాష్ట్రంలో ఆరేండ్లుగా అన్ని పోలీస్​స్టేషన్లలో రాజకీయ జోక్యం పెచ్చుమీరింది. కొందరు మినిస్టర్లు, అధికార పార్టీ ఎమ్మెల్యేలే పోలీస్​ బాస్​లుగా మారిపోయారు.  తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో మెరిట్​ ఆధారంగా పోలీసు పోస్టింగ్​లు ఉండేవి. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే, మినిస్టర్​ లెటర్​ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని కొందరు పోలీసులు అంటున్నారు. ఇందుకోసం లీడర్లు అడిగినంత తాము ఇచ్చుకోవాల్సి వస్తోందని చెప్తున్నారు. ఏరియాను బట్టి పోస్టింగ్​లకు ఎమ్మెల్యేలు రూ. లక్షల్లో రేట్లు ఫిక్స్​ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అలా పోస్టింగ్​ తీసుకోవడంతో లీడర్లు చెప్పిన పనులు, పైరవీలన్నీ చక్కదిద్దాల్సి వస్తోందని, వాళ్ల చెప్పు చేతల్లోనే కేసులు బుక్​ చేయాల్సి వస్తోందని,  వాళ్లు కోరి నట్లుగానే  కేసులు మాఫీ చేయాల్సి వస్తోందని కొందరు పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట వినని వారిని హెడ్​ క్వార్టర్​లో, లూప్​ లైన్​ పోస్టుల్లో అటాచ్​ చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. మరోవైపు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం వల్లే కమిషనర్​ స్థాయి ఆఫీసర్లు కూడా చాలాకాలంగా ఒకే చోట కొనసాగుతున్నారు.

ఎన్నో వివాదాలు

  • రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొందరు పోలీస్​ ఆఫీసర్లు అనవసర వివాదాల్లో తలదూరుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల హఫీజ్​పేట భూములు, కిడ్నాప్​ వ్యవహారంలో ఇదే జరిగింది. ఏపీకి చెందిన మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు విషయంలో పోలీసుల పాత్ర వివాదాస్పదమైంది. టీఆర్​ఎస్ నేతల అనుచరులు, బంధువులకు ప్రమేయముందనే కారణంగానే పోలీసులు ఈ కిడ్నాప్​ కేసులో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనికి తోడు హైదరాబాద్​  చుట్టూ సివిల్​ కేసుల్లో పోలీసులు తలదూర్చటం వెనుక లీడర్లే చక్రం తిప్పుతున్నట్లు అభియోగాలున్నాయి.
  • పొలిటికల్​ పోస్టింగ్​లు కావటంతో కొందరు పోలీస్​ ఆఫీసర్లు అధికార పార్టీ నేతల మెప్పు కోసం.. ప్రతిపక్షాల ఆందోళనలపై రెచ్చిపోతున్నారు.  ఆర్టీసీ సమ్మె టైంలో పోలీస్​ టీమ్​ కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ను గల్లా పట్టి గుంజి.. అనుచితంగా వ్యవహరించటం రాజకీయంగా చిచ్చు రేపింది. దుబ్బాక ఎన్నికల టైమ్​లో సిద్దిపేటలో నేతల ఇండ్లలో సోదాలు చేయటం, బీజేపీ నేతల విషయంలో ఓవర్​ యాక్షన్​ చేయడం ఈసీ జోక్యం చేసుకునేంత వరకు వెళ్లింది. జనగామలో మున్సిపల్​ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగిన బీజేపీ నేతలను స్థానిక సీఐ చావబాదిన ఘటన దుమారం లేపింది. ఇటీవల మీర్​పేటలో ఒక దళిత యువకుడిపై రౌడీషీట్  ఓపెన్​ చేయటం వెనుక కమిషనర్​ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
  • సిద్దిపేటలోనూ లాంగ్ ​స్టాండింగ్​ ఆఫీసర్​గా పేరొందిన సీఐ.. రాజకీయ ఒత్తిడి వల్ల ఒక హత్య కేసులో నిందితులకు సహకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.