- లీడర్ల కనుసన్నల్లో పోలీసింగ్
- వాళ్లు సైగ చేస్తే కేసు, వద్దంటే మాఫీ
- రికమండేషన్ లెటర్ ఉంటేనే పోస్టింగ్
- మంత్రులు, లీడర్ల కోసమే పోలీసులు
పనిచేస్తున్నారంటూ ప్రతిపక్షాల ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ను మినిస్టర్లు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసిస్తున్నారు. ఎస్ఐ నుంచి డీఎస్పీ దాకా.. పోలీసు ఆఫీసర్లకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలన్నా, ఎక్కడికి ట్రాన్స్ఫర్ కావాలన్నా ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్ కంపల్సరీ అనే రూల్ అనధికారికంగా అమలవుతోంది. ఐపీఎస్లు మినహా అన్ని ర్యాంకుల పోలీసు ఆఫీసర్లు ఎమ్మెల్యేల ముందు క్యూ కట్టాల్సి వస్తోంది. ఏ పోలీస్ ఆఫీసర్ ఏ పోలీస్ స్టేషన్లో కొనసాగాలో కూడా లీడర్లే డిసైడ్ చేస్తున్నారు. తమతో మంచిగా ఉండేవాళ్లను తమ నియోజకవర్గ పరిధిలోని స్టేషన్లలో తెచ్చిపెట్టుకుంటున్నారు. లీడర్ల చేతుల్లోనే రిమోట్ ఉండటంతో వారికి అనుకూలంగానే పోలీసులు పనిచేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. బుధవారం పెద్దపల్లి జిల్లాలో జరిగిన లాయర్ దంపతుల హత్య విషయంలోనూ ఇలానే వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. తమకు ప్రాణభయం ఉందని లాయర్ దంపతులు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, పోలీసులు రక్షణ కల్పించకపోవటం వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లే కారణమని ప్రతిపక్షాలు అంటున్నాయి.
పోలీస్ బాస్లుగా లీడర్లు!
రాష్ట్రంలో ఆరేండ్లుగా అన్ని పోలీస్స్టేషన్లలో రాజకీయ జోక్యం పెచ్చుమీరింది. కొందరు మినిస్టర్లు, అధికార పార్టీ ఎమ్మెల్యేలే పోలీస్ బాస్లుగా మారిపోయారు. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో మెరిట్ ఆధారంగా పోలీసు పోస్టింగ్లు ఉండేవి. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే, మినిస్టర్ లెటర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని కొందరు పోలీసులు అంటున్నారు. ఇందుకోసం లీడర్లు అడిగినంత తాము ఇచ్చుకోవాల్సి వస్తోందని చెప్తున్నారు. ఏరియాను బట్టి పోస్టింగ్లకు ఎమ్మెల్యేలు రూ. లక్షల్లో రేట్లు ఫిక్స్ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అలా పోస్టింగ్ తీసుకోవడంతో లీడర్లు చెప్పిన పనులు, పైరవీలన్నీ చక్కదిద్దాల్సి వస్తోందని, వాళ్ల చెప్పు చేతల్లోనే కేసులు బుక్ చేయాల్సి వస్తోందని, వాళ్లు కోరి నట్లుగానే కేసులు మాఫీ చేయాల్సి వస్తోందని కొందరు పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట వినని వారిని హెడ్ క్వార్టర్లో, లూప్ లైన్ పోస్టుల్లో అటాచ్ చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. మరోవైపు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం వల్లే కమిషనర్ స్థాయి ఆఫీసర్లు కూడా చాలాకాలంగా ఒకే చోట కొనసాగుతున్నారు.
ఎన్నో వివాదాలు
- రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొందరు పోలీస్ ఆఫీసర్లు అనవసర వివాదాల్లో తలదూరుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల హఫీజ్పేట భూములు, కిడ్నాప్ వ్యవహారంలో ఇదే జరిగింది. ఏపీకి చెందిన మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు విషయంలో పోలీసుల పాత్ర వివాదాస్పదమైంది. టీఆర్ఎస్ నేతల అనుచరులు, బంధువులకు ప్రమేయముందనే కారణంగానే పోలీసులు ఈ కిడ్నాప్ కేసులో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనికి తోడు హైదరాబాద్ చుట్టూ సివిల్ కేసుల్లో పోలీసులు తలదూర్చటం వెనుక లీడర్లే చక్రం తిప్పుతున్నట్లు అభియోగాలున్నాయి.
- పొలిటికల్ పోస్టింగ్లు కావటంతో కొందరు పోలీస్ ఆఫీసర్లు అధికార పార్టీ నేతల మెప్పు కోసం.. ప్రతిపక్షాల ఆందోళనలపై రెచ్చిపోతున్నారు. ఆర్టీసీ సమ్మె టైంలో పోలీస్ టీమ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను గల్లా పట్టి గుంజి.. అనుచితంగా వ్యవహరించటం రాజకీయంగా చిచ్చు రేపింది. దుబ్బాక ఎన్నికల టైమ్లో సిద్దిపేటలో నేతల ఇండ్లలో సోదాలు చేయటం, బీజేపీ నేతల విషయంలో ఓవర్ యాక్షన్ చేయడం ఈసీ జోక్యం చేసుకునేంత వరకు వెళ్లింది. జనగామలో మున్సిపల్ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగిన బీజేపీ నేతలను స్థానిక సీఐ చావబాదిన ఘటన దుమారం లేపింది. ఇటీవల మీర్పేటలో ఒక దళిత యువకుడిపై రౌడీషీట్ ఓపెన్ చేయటం వెనుక కమిషనర్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
- సిద్దిపేటలోనూ లాంగ్ స్టాండింగ్ ఆఫీసర్గా పేరొందిన సీఐ.. రాజకీయ ఒత్తిడి వల్ల ఒక హత్య కేసులో నిందితులకు సహకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.