- 47 కూల్చేసిన ఉక్రెయిన్
- ఒకరి మృతి, ఇద్దరికిగాయాలు
కీవ్: ఉక్రెయిన్ ఆర్మీకి 88 అత్యాధునిక యుద్ధ ట్యాంకులను అందించి, త్వరలోనే ట్రైనింగ్ ఇస్తామని జర్మనీ ప్రకటించిన మరుసటి రోజే రష్యా విరుచుకుపడింది. బుధవారం అర్ధరాత్రి తర్వాత రాజధాని కీవ్ నగరంపై మిసైళ్లు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడులు జరిపింది. ఈ దాడిలో ఒకరు చనిపోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయని కీవ్ మేయర్ విటాలీ క్లిష్కో తెలిపారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కీవ్లో ఎయిర్రైడ్ సైరన్ల మోతలు వినిపించాయన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురై అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకున్నారని చెప్పారు.
దాడులను సమర్థంగా తిప్పికొట్టామని, రష్యా 55 క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించగా 47 కూల్చేశామని ఉక్రెయిన్ ఆర్మీ వెల్లడించింది. మరో 24 డ్రోన్లను కూల్చినట్లు తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు లక్ష్యంగా రష్యా సైన్యం దాడులు చేసిందని ఒడెసా గవర్నర్ తెలిపారు. ఈ పరిణామాలపై రష్యా రక్షణ శాఖ స్పందిస్తూ.. “యుద్ధ ట్యాంకులు ఇస్తామని అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్ కు హామీ ఇవ్వడమనేది.. ఈ ప్రాంతంలో వాటి ప్రత్యక్ష పాత్ర పెరుగుతున్న తీరుకు నిదర్శనం. అందుకే మేం స్పందించాల్సి వస్తోంది”అని స్పష్టం చేసింది. యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ కు అందిస్తామని అమెరికా కూడా ప్రకటన చేసింది.