అల్లు అర్జున్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగుతో పాటు కేరళలోనూ ఆయనకు అభిమానులున్నారు. ‘పుష్ప’ చిత్రంతో ఇండియా వైడ్గా ఇమేజ్ పెంచుకున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెలలో ‘పుష్ప 2’తో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్కి వెళ్లలేదు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు ఫ్యాన్స్. ‘పుష్ప: ద రూల్’ అప్డేట్ ఇవ్వాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేరళ అభిమానులు ఓ క్రేజీ డెసిషన్ తీసుకున్నారు. డిసెంబర్ 17కి ‘పుష్ప’ విడుదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ‘తగ్గేదే లే’ అంటూ ఈ చిత్రాన్ని కేరళలో రీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దీనికోసం ఏర్పాట్లు కూడా చేసేశారు.
ఇ4 ఎంటర్టైన్మెంట్ సంస్థ కేరళ వ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో ‘పుష్ప’ను రీ రిలీజ్ చేయబోతోంది. ఈ మధ్య స్టార్స్ బర్త్డేలకి వారు నటించిన ఓల్డ్ సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు. కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం రీసెంట్ బ్లాక్ బస్టర్నే మళ్లీ విడుదల చేయాలనుకోవడం వెరీ స్పెషల్ అనే చెప్పాలి. ఈ సినిమా మలయాళంలో రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేసింది. అక్కడి స్టార్ హీరోల సినిమాలకు పోటీగా బన్నీ సినిమా ఆడిందంటే తనకి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ‘పుష్ప2’ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. సుకుమార్ అండ్ టీమ్ ప్రీ ప్రొడక్షన్ను పూర్తిచేసి సెట్స్కి వెళ్లడానికి సిద్ధమయ్యారు.