చ‌క్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. శాస్త్రోక్తంగా శ్రీ చ‌క్ర తిరుమంజ‌నం..

చ‌క్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. శాస్త్రోక్తంగా శ్రీ చ‌క్ర తిరుమంజ‌నం..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం (అక్టోబర్ 02) ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.-  చ‌క్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు వేద పండితులు ప్రకటించారు. 

అంతకుముందు తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.

ఇందులో భాగంగా ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

         ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, నారాయణ సూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

చక్రస్నానం – లోకం క్షేమం

         తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై – లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృథస్నానం చేస్తారు. యజ్ఞ నిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి,  సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం. 

          ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయంగారు, చిన్న జీయంగారు గారు   టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, ప‌లువురు బోర్డు స‌భ్యులు, జెఈవో శ్రీ వీర‌బ్రహ్మం, సీవీఎస్వో ముర‌ళికృష్ణ, ఇతర అధికారులు,పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

అక్టోబ‌రు 3న  భాగ్‌ సవారి

        అక్టోబ‌రు 3న‌ సాయంత్రం 4 గంటలకు వైభ‌వోత్సవ మండ‌పం నుంచి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ  కార్యక్రమం ముగుస్తుంది.   శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు భాగ్‌సవారి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.