ఎంసెట్‌‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ శాశ్వతంగా రద్దు

ఎంసెట్‌‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ శాశ్వతంగా రద్దు

తెలంగాణ ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వేయిటేజీ రాష్ట్ర సర్కారు ఎత్తేసింది. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎంసెట్ లో వచ్చిన మార్కులతోనే ర్యాంకులు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చేవారు. అంతేకాదు.. జేఈఈ మెయిన్, నీట్ లలోనూ ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎత్తివేశారు. ఉన్నత విద్యామండలి ప్రతిపాదన మేరకు ఇంటర్ వెయిటేజీని రాష్ట్ర ప్రభుత్వం శాశ్వతంగా రద్దు చేసింది. గతంలో ఉన్న జీఓను సవరిస్తూ  విద్యాశాఖ కొత్తగా జీఓ 18ని విడుదల చేసింది.

2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. బుధవారం (ఏప్రిల్ 19న) విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ఇంటర్​ మార్కులతో సంబంధం లేకుండా ఎంసెట్ ర్యాంకుల ద్వారానే ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. చాలా ఏండ్లుగా ఎంసెట్‌‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇస్తున్నారు.

ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఆధారంగా ర్యాంకులు అలాట్ చేస్తున్నారు. అయితే.. ఏటా ఎంసెట్ రిజల్ట్ ఇచ్చే సమయంలో పలు బోర్డుల రిజల్ట్ రాకపోవడంతో ర్యాంకుల ప్రకటన ఆలస్యమవుతోంది. దీనికితోడు జేఈఈ, నీట్ వంటి జాతీయ పోటీ పరీక్షలకు ఇంటర్, 12వ తరగతి మార్కులకు వెయిటేజీ ఇవ్వడం లేదు. ఈ వెయిటేజీతో రూరల్ ఏరియాల్లోని సర్కారు కాలేజీల్లో చదివే స్టూడెంట్లకు తక్కువ మార్కులు వస్తుండటం, ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో చదివే స్టూడెంట్లకు ఎక్కువ మార్కులు వస్తుండటంతో ఎంసెట్ ర్యాంకుల్లో భారీగా తేడాలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో వెయిటేజీ ఎత్తేయాలని విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు రావడంతో సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.