- స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో త్వరలో మార్పులు
- డాక్యుమెంట్ రైటర్స్కు లైసెన్సులు
- డాక్యుమెంటేషన్కు ఫీజుల నిర్ధారణ
- వినీతికి పాల్పడితే లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు
హైదరాబాద్, వెలుగు: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీలో రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టడానికి సరిగ్గా ఒక రోజు ముందు రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన విషయం తెలిసిందే. రెవెన్యూ శాఖలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలోనూ పైసలివ్వనిదే ఫైల్ కదలని పరిస్థితి నెలకొందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఆ శాఖలో మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో డాక్యుమెంట్ రైటర్లదే కీలక పాత్ర. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సమీపంలో ఎలాంటి చట్టబద్ధత లేకుండా చిన్నచిన్న గదుల్లో ఈ డాక్యుమెంట్ రైటర్లు కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. త్వరలో తహసీల్దార్ ఆఫీసుల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానుండడంతో అక్కడ కూడా డాక్యుమెంట్ రైటర్ల అవసరం ఏర్పడనుంది. డాక్యుమెంట్ రైటర్లపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని భావిస్తున్న ప్రభుత్వం.. వారిని కంట్రోల్లో పెట్టుకునేందుకు పరీక్షలు నిర్వహించి లైసెన్సులు జారీ చేయాలని యోచిస్తున్నది. అర్హులైనవారికి లైసెన్స్ ఇవ్వడం ద్వారా.. వారు ఏమైనా అక్రమాలకు పాల్పడితే బాధ్యులను చేసి లైసెన్స్ రద్దు చేయడంతోపాటు ఇతర చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. డాక్యుమెంటేషన్ చార్జీలను కూడా ప్రభుత్వమే నిర్ధారించనున్నట్లు సమాచారం.
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు.. రూరల్లో తగ్గింపు, అర్బన్లో పెంపు
రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉండగా.. వీటిలో హెచ్ఎండీఏ పరిధిలోనే 42 ఆఫీసులు ఉన్నాయి. మిగతా 99 ఆఫీసులు జిల్లాకు ఒకటి, రెండు చొప్పున ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 21 తహసీల్దార్ ఆఫీసుల్లో పైలట్ ప్రాజెక్టుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇక మీదట అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్లను అన్ని తహసీల్దార్ ఆఫీసుల్లో ప్రారంభం కానుండడంతో రూరల్ ఏరియాలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు ప్రజల తాకిడి తగ్గే అవకాశముంది. ఇప్పటికే ఇలాంటి ఆఫీసులపై అంచనాకు వచ్చిన సీనియర్ ఆఫీసర్లు రూరల్ ఏరియాలోని సుమారు 20 ఆఫీసులను కుదించాలని భావిస్తున్నట్లు తెలిసింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటైనప్పటికీ అక్కడి భూముల రిజిస్ట్రేషన్ కు ములుగుకు వెళ్లాల్సి వస్తోంది. ఈ జిల్లా కేంద్రంలో రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును ఏర్పాటు చేయనున్నారు. అలాగే హైదరాబాద్ మహానగర శివారులోని మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా నడుస్తుండడం.. రిజిస్ట్రేషన్లు ఎక్కువగా అవుతుండడంతో ఈ జిల్లాల్లో 20 వరకు ఆఫీసులను కొత్తగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.